Prema Sahu: గుళ్లో మహిళా జడ్జి మంగళసూత్రం కొట్టేశారు... లేడీ గ్యాంగ్ అరెస్ట్!

Judge Prema Sahus Mangalsutra Stolen Lady Gang Arrested
షార్ట్స్‌లో చూడండి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మథుర, బృందావన్‌లలోని ఆలయాలు ఇటీవల మహిళా దొంగలకు అడ్డాగా మారాయి. తాజాగా ఓ మహిళా న్యాయమూర్తి మంగళసూత్రమే చోరీకి గురికావడంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు, ముమ్మర దర్యాప్తు చేపట్టి పది మంది సభ్యులున్న ఓ మహిళా దొంగల ముఠాను అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ప్రేమ సాహు ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి బృందావన్‌లోని ఓ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో దైవదర్శనం చేసుకుంటున్న సమయంలో ఆమె మెడలోని మంగళసూత్రం చోరీకి గురైంది. ఈ ఘటనపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

న్యాయమూర్తి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆలయ పరిసరాల్లో నిఘా పెట్టి, అనుమానితుల కదలికలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో, ఆలయాల్లో భక్తులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న పది మంది మహిళలతో కూడిన ముఠాను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు.

అరెస్టయిన మహిళలంతా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి పెద్ద సంఖ్యలో పర్సులు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మథుర, బృందావన్‌లలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాలను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా సభ్యులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచిన అనంతరం వారిని జైలుకు తరలించినట్లు పోలీసులు వివరించారు. ఈ అరెస్టుతో ఆలయాల్లో చోరీలకు కొంతమేర అడ్డుకట్ట పడుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Prema Sahu
Mathura
Vrindavan
temple theft
women thieves
Uttar Pradesh
Madhya Pradesh
Rajasthan
crime news
lady gang

More Telugu News