"నరేందర్... సరెండర్" అని ట్రంప్ అనగానే ప్రధాని మోదీ లొంగిపోయారు: రాహుల్ తీవ్ర విమర్శలు
- ఆపరేషన్ సిందూర్పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారని ఆరోపణ
- భోపాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభలో రాహుల్ ప్రసంగం
ఆపరేషన్ సిందూర్ ప్రారంభం కాగానే ప్రధాని మోదీకి డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. "మోదీజీ.. ఏం చేస్తున్నారు అని ట్రంప్ ఫోన్లో అడిగారు. 'నరేందర్.. సరెండర్' అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలను మోదీ తు.చ. తప్పకుండా పాటించారు" అని రాహుల్ గాంధీ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ గతంలో అగ్రరాజ్యాలను ధైర్యంగా ఎదుర్కొన్నదని గుర్తుచేశారు. "అమెరికా బెదిరింపులను కూడా లెక్కచేయకుండా ఇందిరా గాంధీ హయాంలో 1971లో పాకిస్థాన్ను భారత్ విచ్ఛిన్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడింది, ఎప్పటికీ తలవంచదు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి మహనీయులంతా అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులే" అని రాహుల్ గాంధీ అన్నారు.