భద్రతపై సమీక్ష... త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ

Modi Meets with Chiefs of Staff Amidst Rising Tensions
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశ రాజధానిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు త్రివిధ దళాధిపతులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రస్తుత భద్రతా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ఇరు దేశాల మధ్య వాతావరణం వేడెక్కింది. దీనికి ప్రతిగా భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరిట పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు భారత సైన్యం ప్రకటించింది. ఆ తర్వాత పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న డ్రోన్ దాడిని భారత్ దీటుగా ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తన నివాసంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్), రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో సమావేశమయ్యారు. దేశ సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులు, భద్రతాపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ ఉన్నతస్థాయి సమావేశానికి కొన్ని గంటల ముందే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో దోవల్ తరచుగా ప్రధానమంత్రితో చర్చలు జరుపుతున్నారు.
Go Back to Shorts
Narendra Modi
Indian Armed Forces
National Security
India-Pakistan tensions
Rajnath Singh
Ajit Doval

More Telugu News