ఢిల్లీలోని పంజాబ్ సీఎం ఇంట్లో సోదాల కోసం పోలీసులు వచ్చారు: అతిషి ఆరోపణ

Atishi Claims Police Raided Bhagwant Mann  Delhi Residence
  • ఎక్స్ వేదికగా ఆరోపణలు చేసిన అతిషి
  • బీజేపీ చేసిన తప్పులను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శ
  • అతిషి ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం
ఢిల్లీలోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సింగ్ నివాసంలో సోదాలు చేసేందుకు పోలీసులు వచ్చారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి నివాసంలో సోదాల కోసం పోలీసులు రావడం ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలకు దారితీసింది.

ముఖ్యమంత్రి నివాసంలో సోదాలు చేసేందుకు పోలీసులు రావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేస్తున్న తప్పులను, ఆ పార్టీ నేతలను మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ నేతలు పట్టపగలు డబ్బు, పాదరక్షలు వంటి వస్తువులు పంచుతూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నా పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న నాయకుడి ఇంటిపైకి మాత్రం సోదాల కోసం రావడం దారుణమని అన్నారు.

అయితే, ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. పంజాబ్ ముఖ్యమంత్రి నివాసంలో ఎలాంటి సోదాలు నిర్వహించలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై రిటర్నింగ్ అధికారి ఓపీ పాండే మాట్లాడుతూ, అక్కడ నగదు పంపిణీపై ఫిర్యాదు అందిందని తెలిపారు. దీంతో, తాము అక్కడకు వెళ్లి విచారణ చేసి వెనక్కి వచ్చామని తెలిపారు. సీవిజిల్ యాప్ ద్వారా తమకు ఫిర్యాదు అందిందని వెల్లడించారు. 
Go Back to Shorts
AAP
BJP
New Delhi
Atishi

More Telugu News