Jogi Ramesh: టీడీపీ నేతలతో కలిసి ఊరేగిన జోగి రమేశ్.. తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు

Jogi Ramesh with TDP leaders
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నివాసంపై దాడి చేసిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. అయితే ఇదే కార్యక్రమానికి వచ్చిన జోగి రమేశ్... టీడీపీ నేతలతో కలిసి వేదిక పంచుకున్నారు. అంతేకాదు... వారితో కలిసి ఒకే వాహనంపై పట్టణంలో ఊరేగారు.

కొడాలి నానితో కూడా ఊరేగండి: టీడీపీ కార్యకర్తలు
ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. చంద్రబాబు నివాసంపై దాడికి పాల్పడిన వ్యక్తితో, చంద్రబాబు, లోకేశ్ లను దుర్భాషలాడిన వ్యక్తితో కలిసి కార్యక్రమంలో ఎలా పాల్గొంటారని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధినేతను దుర్భాషలాడిన వ్యక్తితో కలిసి ఊరేగింపులో పాల్గొంటారా? అంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొడాలి నానితో కూడా ఊరేగండని మండిపడుతున్నారు. అధిష్ఠానం ఇచ్చిన అలుసే దీనికి కారణమని విమర్శిస్తున్నారు.

అనుకోకుండా జరిగిన ఘటన: పార్థసారథి
మరోవైపు ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కన్నెర్ర చేశారు. వారి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో పార్థసారథి, గౌతు శిరీష వివరణ ఇచ్చారు. పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ... తనకు సముచిత స్థానం ఇచ్చిన టీడీపీకి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. బలహీన వర్గాలకు చెందిన తనను మంత్రిని చేసిన ఘనత చంద్రబాబుదని అన్నారు. లోకేశ్ ఆశయాలకు అనుగుణంగా తాను పని చేస్తున్నానని చెప్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అందరినీ పిలిచారని... జోగి రమేశ్ కూడా వచ్చారని, అది అనుకోకుండా జరిగిన ఘటన అని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణలు చెపుతున్నానని అన్నారు. పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి కూడా క్షమాపణలు చెపుతున్నానని అన్నారు.

తెలిసి ఏ తప్పూ చేయను: గౌతు శిరీష
గౌతు శిరీష స్పందిస్తూ... ఎవరెవరు వస్తున్నారో తెలియకే జోగి రమేశ్ హాజరైన కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మరోసారి జరగకుండా చూసుకుంటానని అన్నారు. చంద్రబాబుకు, టీడీపీకి, పార్టీకి ఇబ్బంది కలిగే ఏ పనీ తాను చేయనని చెప్పారు. ఎన్నికల ముందు చంద్రబాబును విమర్శించిన వాళ్లు... ఇప్పుడు టీడీపీలోకి వస్తామని అంటున్నారని... అలాంటి వాళ్లను పలాసలో టీడీపీ కార్యాలయం గేటు లోపలకు కూడా అడుగు పెట్టనివ్వడం లేదని తెలిపారు. పోతుల శిరీష టీడీపీలోకి రావాలనుకున్నప్పుడు... ఆమెను తీసుకోవద్దని పార్టీ అధిష్ఠానాన్ని కోరానని చెప్పారు. పార్టీలో ఇంత పట్టుదలగా ఉండే తాను... తెలిసి ఏ తప్పూ చేయనని అన్నారు.

మరోవైపు, విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రికలో గౌరవ అతిథులుగా పేర్కొన్న వారిలో జోగి రమేశ్ పేరు ఉందని... అది చూసినప్పుడైనా టీడీపీ నేతలు అప్రమత్తం కావాల్సిందని టీడీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
Go Back to Shorts
Jogi Ramesh
YSRCP
Kolusu Parthasarathy
Telugudesam

More Telugu News