పాకిస్థాన్ లో... కోర్టును ఆశ్రయించిన మూడేళ్ల చిన్నారి

Three years old girl approached court in Pakistan
  • లాహోర్ నగరంలో అత్యంత ప్రమాదకరంగా వాయు కాలుష్యం
  • ప్రపంచ నగరాల జాబితాలో టాప్ లో లాహోర్ సిటీ
  • స్థానిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన బాలిక
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో మూడేళ్ల చిన్నారి స్థానిక ప్రభుత్వంపై కోర్టును ఆశ్రయించింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం! లాహోర్ నగరంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరిందని, నగరాన్ని కాలుష్య మేఘాలు కమ్మేస్తున్నాయని... ప్రభుత్వ వైఫల్యం వల్ల గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా మారిందని ఆ బాలిక పిటిషన్ దాఖలు చేసింది. 

గత కొన్ని రోజులుగా లాహోర్ నగర గాలి నాణ్యత సూచీ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 800 పాయింట్లకు ఎగువన నమోదవుతోంది. ప్రపంచంలోని అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలో లాహోర్ అగ్రస్థానంలో ఉంది. 

ఇవాళ (నవంబరు 7) కూడా లాహోర్ సిటీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో పైభాగాన ఉంది. ఈ నేపథ్యంలోనే... అమల్ సఖీరా అనే మూడేళ్ల బాలిక నేడు తన న్యాయవాదితో కలిసి లాహోర్ హైకోర్టు వద్దకు వచ్చింది. వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో స్థానిక పంజాబ్ ప్రభుత్వం విఫలమైందంటూ పిటిషన్ దాఖలు చేసింది. 

కాలుష్యం కారణంగా పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని... తనకు, తన స్నేహితులకు, భవిష్యత్ తరాల వారికి న్యాయం చేయాలని కోర్టును కోరింది. ఆర్టికల్ 99-ఏ ప్రకారం ప్రభుత్వం తమ ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని అమల్ సఖీరా తన పిటిషన్ లో పేర్కొంది. 

పాకిస్థాన్ రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను కాపాడడంలో స్థానిక పంజాబ్ ప్రావిన్స్ చేతులెత్తేసిందని విమర్శించింది. దీనిపై తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని చిన్నారి బాలిక కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
Go Back to Shorts
Three Years Old Girl
Court
Lahore
Pollution
Pakistan

More Telugu News