Advertisement

రిమోట్ కంట్రోల్ గురించి జగన్ కే బాగా తెలుసు: షర్మిల

YS Sharmila Press Meet
  • ఏపీ సీఎంను రెండు రిమోట్లు కంట్రోల్ చేస్తున్నాయన్న ఏపీసీసీ చీఫ్
  • కేంద్రంలో బీజేపీ, ఇంట్లో మరో ‘బి’ చెప్పినట్లే చేస్తాడని విమర్శ
  • వైఎస్సార్ వారసుడివా లేక మోదీ వారసుడివా అంటూ జగన్ కు ప్రశ్న
ప్రధాని నరేంద్ర మోదీకి రిమోట్ కంట్రోల్ గా జగన్ వ్యవహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వానికి అన్నింటా మద్దతు తెలుపుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రిని రెండు రిమోట్ కంట్రోల్ లు నియంత్రిస్తున్నాయని, రెండు పేర్లూ ‘బి’ తోనే స్టార్ట్ అవుతాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో సీఎం ఇంట్లో మరొకరికి జగన్ రిమోట్ కంట్రోల్ గా ఉన్నారని.. వాళ్ల సూచనలను, కట్టడిని తప్పకుండా పాటిస్తాడని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు రిమోట్ కంట్రోల్ గా మారిందంటూ జగన్ చేసిన ఆరోపణలను షర్మిల తిప్పికొట్టారు.

మోదీ దత్తపుత్రుడిలా..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వంటి వారే ఈ విషయం వెల్లడించారని గుర్తుచేశారు. మోదీ చేతిలో రిమోట్ కంట్రోల్ గా మారి, మోదీ ఢిల్లీలో స్విచ్ నొక్కగానే ఏపీలో జగన్ మద్దతు తెలుపుతున్నాడని ఆరోపించారు. ఐదేళ్లుగా ఎన్డీయే సర్కారు చేసిన ప్రతీ పనికీ, తీసుకొచ్చిన ప్రతీ బిల్లుకూ జగన్ మద్దతు తెలిపాడని చెప్పారు. చివరకు ఓ క్రిస్టియన్ అయ్యుండీ, మణిపూర్ లో క్రిస్టియన్లపై జరుగుతున్న అరాచకాలకు మద్దతు తెలిపారని జగన్ పై షర్మిల మండిపడ్డారు.

మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టి అవిశ్వాస తీర్మానంపై చర్చలో జగన్ ఎన్డీయే సర్కారుకు మద్దతిచ్చారని గుర్తుచేశారు. వైఎస్సార్ తీవ్రంగా వ్యతిరేకించిన, మతతత్వ పార్టీ అని విమర్శించిన బీజేపీతో జగన్ అంటకాగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే.. ‘జగన్ వైఎస్సార్ వారసుడా లేక మోదీ వారసుడా’ అనే సందేహం వస్తోందని, మోదీ దత్తపుత్రుడనే మాట నిజమేనని అనిపిస్తోందని వైఎస్ షర్మిల చెప్పారు.

Advertisement
YS Sharmila
Jagan
Remote controll
BJP
Modi
Lok Sabha Polls
AP Elections

More Telugu News