బీజేపీలో చేరిన కేరళ మాజీ ముఖ్యమంత్రి కూతురు... తీవ్రంగా స్పందించిన సోదరుడు
- కాషాయం కండువా కప్పుకున్న కె.కరుణాకరన్ కూతురు పద్మజా వేణుగోపాల్
- బీజేపీలో చేరినందుకు సంతోషంగా ఉందన్న పద్మజా వేణుగోపాల్
- మా కుటుంబం నుంచి ఒకరు బీజేపీలో చేరడం విచారకరమన్న సోదరుడు
బీజేపీలో చేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తనకు చాలా సంతోషంగా ఉందని... ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో తాను ఆనందంగా లేనని అందుకే పార్టీ మారినట్లు తెలిపారు. తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కలేదని, అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. సోనియా గాంధీ అంటే తనకు చాలా గౌరవం ఉందని... కానీ తనకు ఎప్పుడూ సమయం ఇవ్వలేదని విమర్శించారు.
ఇదిలావుంటే, పద్మజా వేణుగోపాల్ బీజేపీలో చేరడంపై ఆమె సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కె.మురళీధరన్ తీవ్రంగా స్పందించారు. ఆమె నిర్ణయం నమ్మకద్రోహమని విమర్శించారు. తన తండ్రి కరుణాకరన్ ఎప్పుడూ బీజేపీతో రాజీపడలేదని, ఆయన లౌకికవాదం వైపు ఉన్నారని వ్యాఖ్యానించారు. తన కుటుంబంలోని ఒకరు బీజేపీలో చేరడం విచారకరమన్నారు.