Pawan Kalyan: నేను గౌరవించే కాపు పెద్దలు నన్ను దూషించినా దీవెనలుగానే భావిస్తాను: పవన్ కల్యాణ్

Pawan Kalyan open letter to Kapu leaders
షార్ట్స్‌లో చూడండి
జనసేనాని పవన్ కల్యాణ్ కాపు నేతలకు బహిరంగ లేఖ రాశారు. వైసీపీకి ఓటమి కళ్లెదుటే కనిపిస్తోందని, అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. తాను గౌరవించే కాపు పెద్దలు నన్ను తిట్టినా దీవెనలుగానే భావిస్తాను అని తెలిపారు. నన్నెంతగా దూషించినా వారికి జనసేన పార్టీ వాకిలి తెరిచే ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పి, కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలి అని పేర్కొన్నారు. కుట్రలు, కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలకు నా విన్నపం అంటూ పవన్ తన లేఖలో పేర్కొన్నారు. 

"రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనివార్యం. ఏపీ ప్రజలు తాము వైసీపీని సాగనంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్దిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండడం వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. నేను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి, పార్టీని బలహీనపరిచే దుష్ట ప్రయత్నాలకు ఒడిగడుతోంది. 

సదరు కాపు పెద్దలు ఆ విధంగా మాట్లాడడానికి వారి కారణాలు వారికి ఉండవచ్చు... వారిని నేను సహృదయంతో అర్థం చేసుకోగలను. వారి తిట్లే నాకు దీవెనలు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కులాల సాధికారతతో పాటు అగ్రకులాల్లోని పేదలకు అండగా నిలిచి వారి ఆర్థిక ఉన్నతికి తోడ్పడాలన్నదే నా ఉద్దేశం. కులాలను కలిపే ఆలోచనా విధానంతోనే అందరూ ఒకే తాటిపైకి రాగలరన్నది నా విశ్వాసం. అన్ని కులాలను కలుపుకుని అడుగులు వేసే సమర్థత కాపులకు ఉంది కాబట్టే పెద్దన్న పాత్ర తీసుకోవాలని కోరాను. 

రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించారు కాబట్టే కాపుల్లో చీలికలు తెచ్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది. కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఆ తర్వాత ఎటు మళ్లిందో కాపు సామాజిక వర్గం గమనించింది. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని... కాపులకు బలమైన జిల్లాగా భావించే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో కరాఖండీగా ప్రకటించిన జగన్ రెడ్డిని కాపు నేతలు ప్రశ్నించాలి. 

వైసీపీ ప్రాయోజిత విషపూరిత ప్రచారాలను, తప్పుడు అభిప్రాయాలతో కూడిన విశ్లేషణలను, వార్తలను విశ్వసించవద్దని కాపు సామాజిక వర్గంతోపాటు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా" అంటూ తన లేఖలో వివరించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Kapu Leaders
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News