మేం ముస్లింలకు దూరమవుతున్నామని ప్రచారం చేస్తున్నారు: పవన్ కల్యాణ్
- విశాఖ సౌత్ నియోజకవర్గానికి చెందిన సాదిక్ జనసేనలో చేరిక
- పార్టీ కండువా కప్పిన పవన్ కల్యాణ్
- ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అంటూ ముస్లింలకు పవన్ విజ్ఞప్తి
కాగా, తాము బీజేపీతో భాగస్వాములుగా ఉండడం వల్ల ముస్లింలు దూరమవుతున్నారని ప్రచారం చేస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ముస్లింలను ఎప్పటికీ ఓటు బ్యాంకుగా చూడబోనని ఉద్ఘాటించారు. ముస్లింల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తామని వివరించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు అవకాశం ఇచ్చి చూడండి అని ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. మీకు అన్యాయం జరిగితే నేను ముస్లింల వైపే ఉంటా... మీ పక్షాన గళం ఎత్తే నాయకుడ్ని నేనే అవుతా అని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందని పవన్ పిలుపునిచ్చారు. నీటి సమస్య, వలసలు తగ్గాలని, ఉపాధి అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు.
మంగళగిరిలో ఇవాళ పవన్ కల్యాణ్ సమక్షంలో విశాఖకు చెందిన వైసీపీ కార్పొరేటర్ మహ్మద్ సాదిక్ జనసేనలో చేరారు. ఆయనకు పవన్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగానే ఆయన పై వ్యాఖ్యలు చేశారు.