State Election Commission: రేవంత్ రెడ్డిపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

BRS complaint EC about Revanth Reddy and Congress ads
  • రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఫిర్యాదు
  • రేవంత్ రెడ్డిని ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని విజ్ఞప్తి
  • బీఆర్ఎస్ పార్టీని కించపరిచేలా కాంగ్రెస్ ప్రకటనలు ఇస్తోందన్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
  • నిషేధించిన ప్రకటనను బ్యాన్డ్ అని పెట్టి మరీ ప్రసారం చేస్తున్నారని మండిపాటు
రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, అలాగే బీఆర్ఎస్ పార్టీని కించపరిచేలా కాంగ్రెస్ ప్రకటనలు ఇస్తోందని, వీటిని వెంటనే నిలిపివేసేలా చూడాలని బీఆర్ఎస్ లీగల్ టీమ్ సోమవారం సీఈవో వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ప్రకటనలపై ఇదివరకే ఫిర్యాదు చేసిన అధికార పార్టీ తాజాగా మరోసారి చేసింది. ఈ మేరకు సీఈవోకు... లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ వినతిపత్రం అందించారు. కార్యకర్తల్ని రెచ్చగొడుతూ దుర్భాషలాడుతున్న రేవంత్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించాలని బీఆర్ఎస్ లీగల్ టీమ్ కోరింది.

ఈ సందర్భంగా సోమా భరత్ మాట్లాడుతూ... మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించకుండా కామెడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చంపేటలో గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోందో ప్రజలు ఆలోచించాలన్నారు. రేవంత్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని ఈసీని కోరామన్నారు. నిషేధించిన ప్రకటనను బ్యాన్డ్ అని పెట్టి మరీ కాంగ్రెస్ నేతలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు.
State Election Commission
Revanth Reddy
Congress
BRS

More Telugu News