సాయికృష్ణ కేసులో కీలక మలుపు: కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీఐ నాగరాజు విచారణ

CI Nagaraju investigation in police station key turn in Sai Krishna case
  • సస్పెండైన సీఐ నాగరాజును పోలీస్ స్టేషన్‌లో విచారించేందుకు సిట్‌కు అనుమతి
  • జులై 9 నుంచి 8 రోజుల పాటు విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
  • కింది కోర్టు విధించిన షరతులను సడలించిన ఉన్నత న్యాయస్థానం
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (25) కస్టోడియల్ డెత్ ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌‍కు గురైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.ఎస్.వి.వి. నాగరాజును జులై 9 నుంచి ఎనిమిది రోజుల పాటు పోలీస్ కస్టడీలో విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) మంగళవారం న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఐ నాగరాజును కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారించనున్నారు.

గతంలో విజయవాడలోని దిగువ కోర్టు నాగరాజును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే విచారించాలని, ఆ ప్రక్రియను ఆడియో-వీడియో రికార్డింగ్ చేయాలని షరతులు విధించింది. అయితే, ఈ నిబంధనల వల్ల సాక్ష్యాధారాల సేకరణతో పాటు క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ వంటి ప్రక్రియలకు ఆటంకం కలుగుతుందని సిట్ హైకోర్టును ఆశ్రయించింది. సిట్ తరఫు వాదనలతో ఏకీభవించిన జస్టిస్ కుంచం మహేశ్వరరావు, దిగువ కోర్టు విధించిన షరతులను సడలిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

కేసు నేపథ్యం

వివిధ కేసుల విచారణ నిమిత్తం విజయవాడకు చెందిన సాయికృష్ణను పోలీసులు మార్కాపురంలో అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి అతను అదృశ్యమయ్యాడు. తన కుమారుడిని విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, ఆ తర్వాత సాక్ష్యాలను నాశనం చేసేందుకు మృతదేహాన్ని విద్యుత్ శ్మశానవాటికలో రహస్యంగా దహనం చేశారని సాయికృష్ణ తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆమె ఫిర్యాదు మేరకు జూన్ 19న హత్య, అక్రమ నిర్బంధం, సాక్ష్యాల ధ్వంసం వంటి అభియోగాలపై బీఎన్ఎస్ కింద కేసు నమోదైంది. ప్రభుత్వం నియమించిన సిట్ బృందం, జూన్ 23న సీఐ నాగరాజుతో పాటు అతనికి సహకరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసింది.
Advertisement
CI Nagaraju
Gade Sai Krishna
AP High Court
SIT investigation
Custodial death case
Vijayawada Krishna Lanka

More Telugu News