Kotamreddy Sridhar Reddy: సీఎం జగన్ ఆందోళనకు గురవుతున్నారు: కోటంరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు, యువనేత నారా లోకేశ్ పాదయాత్రకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుండటంతో ముఖ్యమంత్రి జగన్ ఆందోళనకు గురవుతున్నారని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని, మంచి పాలన అందించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని ఎద్దేవా చేశారు. బలప్రయోగాలతో తమను అడ్డుకోవడం మీ వల్ల కాదని... రెట్టించిన సమరోత్సాహంతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పారు. ప్రభుత్వ అక్రమ కేసులను, వేధింపులను ఎదుర్కొంటామని అన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్వహించిన పాదయాత్రలో కోటంరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.