bandla ganesh: మళ్లీ రాజకీయాల్లోకి బండ్ల గణేశ్.. ‘బానిసత్వానికి బైబై.. నీతిగా రాజకీయాలు చేస్తా’నంటూ వరుస ట్వీట్లు

  • రాజకీయాల్లోకి రానని గతంలో చాలా సార్లు చెప్పిన బండ్ల గణేశ్
  • నిజాయతీతో కూడిన రాజకీయాలు చేస్తానంటూ తాజాగా వరుస ట్వీట్లు
  • అయితే ఏ పార్టీ అనేది ప్రస్తావించని వైనం
bandla ganesh confirms political re entry

తన రాజకీయ భవిష్యత్తు గురించి సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తానంటూనే.. బానిసత్వానికి బైబై అంటూ ట్వీట్ చేశారు. ఎక్కడా పార్టీ గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ ఆయన ప్రస్తావించలేదు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పొత్తుల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే బండ్ల గణేశ్ ట్వీట్లు చేయడం చర్చనీయాంశమవుతోంది.

శుక్రవారం రాత్రి బండ్ల గణేశ్ వరుస ట్వీట్లు పెట్టారు. ‘‘నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటా’’.. ‘‘నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తా’’.. ‘‘బానిసత్వానికి బాయ్ బాయ్.. నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై’’ అంటూ వరుస ట్వీట్లు చేశారు.

చివరగా ‘‘రాజకీయాలంటే నిజాయితీ.. రాజకీయాలంటే నీతి.. రాజకీయాలంటే కష్టం.. రాజకీయాలంటే పౌరుషం.. రాజకీయాలంటే శ్రమ.. రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి. రావాలి. అందుకే వస్తా’’ అని పేర్కొన్నారు. 

గతంలో తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి ‘సెవన్ ఓ క్లాక్ బ్లేడ్’ డైలాగ్‌తో బండ్ల గణేశ్ కొన్ని రోజులు వైరలయ్యారు. తర్వాత కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆ పార్టీకి దూరం జరిగారు. ఇక యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రాను అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.

More Telugu News