Ukraine: సాయం పెంచాలంటూ మోదీకి జెలెన్ స్కీ లేఖ

  • మానవతా సాయం కింద ఉక్రెయిన్ కు మందులు పంపిస్తున్న కేంద్రం
  • ఈ సాయాన్ని మరింత పెంచాలని కోరిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్
  • ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖికి లెటర్లు అందజేసిన ఉక్రెయిన్ మంత్రి
Ukraine Seeks More Humanitarian Aid

భారత దేశం అందిస్తున్న మానవతా సాయాన్ని మరింత పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన లేఖ రాశారని కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. రష్యా దురాక్రమణతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని జెలెన్ స్కీ ఆ లేఖలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అందిస్తున్న మానవతా సాయానికి కృతజ్ఞతలు తెలిపిన జెలెన్ స్కీ.. ఈ సాయాన్ని మరింత పెంచాలని కోరారు. మన దేశ పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ మంత్రి ఎమినె జపరోవా ఈ లేఖలను ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షీ లేఖికి అందజేశారు.

రష్యా దురాక్రమణతో దెబ్బతిన్న తమ దేశాన్ని ఆదుకోవాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, మందులు, వైద్య పరికరాలు, తదితర అత్యవసర వస్తువులను మరింత ఎక్కువగా పంపించాలని కోరారని మీనాక్షీ లేఖి చెప్పారు. దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని, సాయాన్ని మరింత పెంచాలని సూచించారని మంత్రి చెప్పారు.

More Telugu News