Ram Gopal Varma: "మీరింకా ఉన్నారా..." వీహెచ్ పై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు

  • ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం జగన్‌కు వీహెచ్ లేఖ
  • ‘ఓ తాతగారూ మీరింకా ఉన్నారా?’ అంటూ ఆర్జీవీ ట్వీట్ 
ram gopal varma satirical counter on v hanumantha rao

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ చేసిన కామెంట్ల దుమారం ఇంకా చల్లారలేదు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఆర్జీవీ మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తనపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుపై సెటైరికల్ గా స్పందించారు. 

‘‘ఓ తాతగారూ మీరింకా ఉన్నారా??? నాసా యాక్ట్ వర్తించదు టాడా యాక్ట్‌ని 1995 లోనే తీసేశారు... ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్‌కి ఆ గతి... ఒకసారి డాక్టర్‌కి చూపించుకోండి’’ అని ట్విట్టర్ లో ఆర్జీవీ ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఓ వెబ్ సైట్ లో వచ్చిన వీహెచ్ వ్యాఖ్యల కథనాన్ని కూడా వర్మ పంచుకున్నారు.

ఇటీవల నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ.. ‘‘తినండి.. తాగండి.... ’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళితే అక్కడ రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చని, బతికున్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలని సూచించారు. నచ్చిన విధంగా బతకాలని, హార్డ్‌వర్క్‌ చేయకుండా, స్మార్ట్‌గా పని చేస్తూ ఉపాధ్యాయుల మాటలు పట్టించుకోకుండా ఇష్టానుసారం జీవించాలని ఉచిత సలహాలు ఇచ్చారు.

దీంతో ఆర్జీవీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం జగన్‌కు వీహెచ్ లేఖ రాశారు. మహిళలను ఉద్దేశించి ఆర్జీవీ చేసిన కామెంట్లు సరికాదని మండిపడ్డారు. ఇప్పటివరకు ఆర్జీవీ కామెంట్లపై సినీ పరిశ్రమ నుంచి ఎవ్వరూ స్పందించలేదని... ఇలాగే వదిలేస్తే మహిళలను అవమానించడం అలవాటవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్మకు దమ్ముంటే ఉస్మానియా లేదా కాకతీయ యూనివర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని సవాల్ విసిరారు. నాగార్జున వర్సిటీ వీసీని సస్పెండ్‌ చేసి, ఆర్జీవీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

More Telugu News