Keerthi Suresh: తెలుగు సినిమాలపై పెద్దగా దృష్టిపెట్టని కీర్తి సురేశ్!

  • కీర్తి సురేశ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ 
  • తెలుగులో పడిన హిట్స్ ను ఉపయోగించుకోలేకపోతున్న కీర్తి 
  • తమిళ .. మలయాళ సినిమాలకే ప్రాధాన్యత 
  • ఈ నెల 30వ తేదీన రానున్న 'దసరా'
Keerthi Suresh Special

కీర్తి సురేశ్ కథానాయికగా వెండితెరకి పరిచయమై అప్పుడే పదేళ్లు అయిపోయింది. ఈ పదేళ్ల కెరియర్లో తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఆమెకంటూ కొన్ని చెప్పుకోదగిన సినిమాలు ఉన్నాయి. మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేశ్, ఆ తరువాత కోలీవుడ్ లో కాలుపెట్టింది.  2015లో 'నేను శైలజ' సినిమాతో తెలుగులో ఆమె కెరియర్ మొదలైంది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే ఆ సినిమాకి యూత్ నుంచి విశేషమైన ఆదరణ లభించినప్పటికీ, కీర్తి వరుస సినిమాలతో ఇక్కడ తన జోరును కొనసాగించలేకపోయింది. అందుకు కారణం అప్పటికే ఆమె వరుసగా తమిళ సినిమాలను అంగీకరించడమే. 2017లో మళ్లీ ఆమె 'నేను లోకల్' సినిమా చేసింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ పట్టుకొచ్చి ఆమె దోసిట్లో పెట్టింది. అలాగే 'మహానటి' మరింత పేరును తీసుకొచ్చింది. ఆ తరువాత కూడా ఆమె తమిళ సినిమాలనే వరుసగా చేస్తూ వెళ్లింది. అంత పెద్ద హిట్ తోను ఇక్కడ తన జోరు చూపించలేకపోయింది. 

ఇక 'సర్కారువారి పాట' తరువాత ఆమె నుంచి 'దసరా' రానుంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత కూడా కీర్తి జాబితాలో వరుసగా తమిళ సినిమాలే కనిపిస్తున్నాయి.  'భోళా శంకర్'లో ఆమె చేస్తున్నప్పటికీ, అది చెల్లెలి పాత్ర కావడంతో, 'దసరా' సినిమానే కీలకమని అనుకోవాలి. తమిళ .. మలయాళ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న కీర్తి, ఇక్కడ టాప్ త్రీ పొజిషన్లలో కొనసాగుతుండటం విశేషమే. 

More Telugu News