bandla ganesh: దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా కేసీఆర్ కే ఉంది: బండ్ల గణేశ్

  • కుటుంబంతో కలిసి యాదాద్రీశుడిని దర్శించుకున్న సినీ నిర్మాత
  • ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని సీఎంపై పొగడ్తల వర్షం
  • మహోన్నత వ్యక్తి అంటూ వరుస ట్వీట్లు చేసిన బండ్ల గణేశ్
Bandla Ganesh Tweets Praising Telangana CM KCR Goes Viral On Social media

తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే కాదు భారత దేశాన్నే ప్రగతిపథం వైపు నడిపించే సత్తా కేసీఆర్ కు ఉందంటూ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పేర్కొన్నారు. వరుస ట్వీట్లతో సీఎం కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. మంగళవారం యాదాద్రి వెళ్లిన బండ్ల గణేశ్.. కుటుంబంతో కలిసి యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శిల్పకళా సంపదను చూసి తాను అచ్చెరువు పొందినట్లు చెప్పారు. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దినందుకు తెలంగాణ ప్రజల తరఫున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రగతి పథం వైపు దూసుకుపోతుందని చెప్పటానికి యాదాద్రి ఓ ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు గాని ఆయన ఆలోచన విధానం గానీ మహా అద్భుతమని కొనియాడారు. చాలా రోజుల నుంచి యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకోవాలని అనుకున్నానని, స్వామి వారి అనుగ్రహం లేకపోవడంతో కుదరలేదని బండ్ల గణేశ్ చెప్పారు. 

దేశంలోని చిన్న రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని, దీనికి కేసీఆర్ ఆలోచన విధానం, కఠోర తపస్సు ఉపయోగపడ్డాయని బండ్ల గణేశ్ అన్నారు. నరసింహ స్వామి కరుణాకటాక్షం ఎల్లప్పుడూ కేసీఆర్ పై ఉండాలని కోరుకున్నానని చెప్పారు. కేసీఆర్ దగ్గరి నుంచి ఏదో ఆశించి తానీ విషయాన్ని చెప్పట్లేదని, ఆయన చేసిన మంచిని బయటకు చెప్పానని స్పష్టం చేశారు. దేశానికి భవిష్యత్తు చూపగల సత్తా ఉన్న నేత కేసీఆర్ అని, ఆయన మహోన్నత వ్యక్తి అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More Telugu News