Giridhar Aramane: ఏపీ సీఎస్ రేసులో కొత్త పేరు... గిరిధర్ అరమణే!

  • ప్రస్తుతం రక్షణశాఖ కార్యదర్శిగా ఉన్న గిరిధర్ అరమణే
  • నేడు ఏపీ సీఎం జగన్ తో సమావేశం
  • రక్షణ శాఖ నుంచి అరమణేను రిలీవ్ చేయాలని కేంద్రానికి ఏపీ లేఖ? 
Senior IAS officer Giridhar Aramane met CM Jagan

కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణే నేడు తాడేపల్లిలో ఏపీ సీఎం జగన్ ను కలిశారు. రక్షణ శాఖకు చెందిన పలు ప్రాజెక్టులపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రక్షణ రంగ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 

కాగా, ఈ భేటీ నేపథ్యంలో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఏపీ సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన గిరిధర్ అరమణే కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కొత్త సీఎస్ కోసం ఏపీ సర్కారు కసరత్తులు చేస్తున్న సమయంలోనే గిరిధర్ అరమణే సీఎం జగన్ ను కలవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అటు, రక్షణ శాఖ నుంచి అరమణేను రిలీవ్ చేయాలని ఏపీ సర్కారు కేంద్రానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. 

ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం నవంబరు 30తో ముగియనుంది. అయితే, నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి దాదాపు ఖాయమని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, సీఎం జగన్ తో నేడు గిరిధర్ అరమణే భేటీతో సీఎస్ రేసు ఆసక్తికరంగా మారింది.

More Telugu News