cell tower: మహారాష్ట్రలో సెల్ టవర్ ను ఎత్తుకెళ్లిన దొంగలు

  • విడిభాగాలను గుట్టుచప్పుడు కాకుండా మాయంచేశారు
  • టవర్ కంపెనీ కొంతకాలం పట్టించుకోకపోవడంతో దొంగల చేతివాటం
  • రూ.35 లక్షల నష్టం వాటిల్లిందని పోలీసులకు ఫిర్యాదు  
cell tower stolen in maharashtra

ఇంటి ముందు నిలిపిన వాహనాలో.. ఇంట్లోని వస్తువులో దొంగలు ఎత్తుకెళ్లడం చూస్తూనే ఉంటాం. కానీ మహారాష్ట్రలో మాత్రం దొంగలు ఏకంగా ఓ సెల్ టవర్ నే ఎత్తుకెళ్లారు. ఎత్తుగా, చుట్టుపక్కల చాలా దూరం కనిపించేలా ఉండే టవర్ ను పార్టులు పార్టులుగా విడదీసి గప్ చుప్ గా మొత్తం కాజేశారు. మహారాష్ట్రలోని వాలూజ్ లో జరిగిందీ దొంగతనం. ఈ చోరీలో సదరు టవర్ కంపెనీకి దాదాపు రూ.35 లక్షల మేర నష్టం వాటిల్లిందట.

జీటీఎల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ వాలూజ్ లో ఓ సెల్ టవర్ ఏర్పాటు చేసింది. 2009లో కొంత స్థలాన్ని పదేళ్ల పాటు లీజుకు తీసుకుని, అందులో ఈ టవర్ ను ఏర్పాటు చేసింది. ఆ భూమి యజమానికి నెల నెలా రూ.9500 అద్దె చెల్లించేది. పదేళ్ల గడువు పూర్తికాకముందే 2018లో సదరు భూమి యజమాని జీటీఎల్ కంపెనీని ఖాళీ చేయించాడు. ఆ తర్వాత ఆ టవర్ గురించి జీటీఎల్ సంస్థ పట్టించుకోలేదు. సంస్థ ఉద్యోగులు కూడా అటువైపు తొంగిచూడలేదు.

వాలూజ్ చుట్టుపక్కల ఏరియాకు జీటీఎల్ కంపెనీ కొత్త ప్రతినిధిగా అమర్ లాహోత్ ను నియమించింది. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన లాహోత్.. వాలూజ్ లో తమ కంపెనీ టవర్ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే, అక్కడ టవరే కనిపించలేదు. గతంలో అక్కడొక టవర్ ఉండేదనేందుకు సాక్ష్యంగా చిన్న చిన్న పరికరాలు మాత్రం కనిపించాయి. దీనిపై పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో లాహోత్ కోర్టు మెట్లెక్కారు. కోర్టు ఆదేశాలతో వాలూజ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాఫ్తు మొదలు పెట్టారు.

More Telugu News