North Korea: మళ్లీ కవ్వించిన కిమ్.. రెండు వారాల్లో ఆరు క్షిపణుల ప్రయోగం

  • ఈ ఉదయం రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
  • ఐరాస భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చిన అమెరికా
  • ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్న దక్షిణ కొరియా
North Korea carries out sixth missile launch in two weeks

అమెరికా, జపాన్‌లను కవ్వించడంలో ముందుండే ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ మరోమారు ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేశారు. ఆంక్షలను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా క్షిపణులను పరీక్షిస్తున్న ఉత్తర కొరియా ఈ ఉదయం మరో రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను పరీక్షించింది. గత రెండు వారాల్లో ఇది ఆరో పరీక్ష కావడం గమనార్హం. నార్త్ కొరియా క్షిపణులను పరీక్షించిన వెంటనే దక్షిణ కొరియా అప్రమత్తమైంది. ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించింది.

కవ్వింపు చర్యలకు బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. కాగా, మంగళవారం కూడా జపాన్ మీదుగా ఉత్తర కొరియా క్షిపణిని పరీక్షించింది. ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఉత్తర కొరియా చర్యలకు రష్యా, చైనా నుంచి లభిస్తున్న రక్షణ సహకారమే కారణమని అమెరికా ఈ సమావేశంలో ఆరోపించింది.

మరోవైపు, తమ దేశం మీదుగా క్షిపణిని పరీక్షించడాన్ని తీవ్రంగా పరిగణించిన జపాన్, దక్షిణ కొరియాలు నిన్న యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. వీటిని అమెరికా సమర్థించింది. తమ నౌకాదళ ఆయుధాలను కొరియా ద్వీపకల్పానికి తరలించింది. ఈ సందర్భంగా దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్స్ స్పందిస్తూ.. ఉత్తర కొరియా నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా నిర్ణయాత్మక శక్తితో ఎదుర్కొంటామని స్పష్టం చేసింది.

More Telugu News