Kodali Nani: అశ్వనీ దత్, రాఘవేంద్రరావు వంటి వారికి కోరుకున్న చోట భూములిచ్చారు: కొడాలి నాని

  • అమరావతిలో టీడీపీ నేతలందరికీ భూములున్నాయన్న నాని 
  • కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుకా చౌదరి అమరావతి గురించి మాట్లాడడమేమిటని నిలదీత 
  • టీడీపీ నేతలకు రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదని విమర్శ 
Kodali Nani comments on Amaravati

రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఒక కులం కోసమో, మతం కోసమో వికేంద్రీకరణ చేయడం లేదని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అమరావతిని కమ్మరావతి, భ్రమరావతిని చేసింది చంద్రబాబేనని కొడాలి నాని అన్నారు. అమరావతిలో టీడీపీ నేతలందరికీ భూములు ఉన్నాయని చెప్పారు. సినీ ప్రముఖులు అశ్వనీ దత్, రాఘవేంద్రరావు లాంటి వాళ్లకు అమరావతిలో కోరుకున్న చోట భూములిచ్చారని ఆరోపించారు. తనకు కావాల్సిన వారికి కారు చౌకగా భూములను కట్టబెట్టారని అన్నారు. 

టీడీపీ నేతలకు రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదని, స్వార్థ ప్రయోజనాలే వారికి ముఖ్యమని కొడాలి నాని దుయ్యబట్టారు. అమరావతిని రియలెస్టేట్ కంపెనీగా మార్చారని విమర్శించారు. ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుకా చౌదరి అమరావతి గురించి మాట్లాడటమేంటని ఎద్దేవా చేశారు. 40 ఆలయాలను కూల్చిన చంద్రబాబు ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారని చెప్పారు.

More Telugu News