Sourav Ganguly: ‘షేమ్ ఆన్ యు’.. కెప్టెన్సీ నుంచి కోహ్లీ తొలగింపుపై బీసీసీఐ, గంగూలీపై విరుచుకుపడుతున్న అభిమానులు

  • వన్డే కెప్టెన్సీ పగ్గాలు రోహిత్‌కు అప్పగింత
  • కోహ్లీ తొలగింపుపై కారణం చెప్పాలని డిమాండ్
  • గంగూలీ, జై షా శకం గాడితప్పినట్టుగా ఉందని విమర్శలు
  • ప్రపంచకప్‌నే ప్రాతిపదికగా ఎలా తీసుకుంటారని ధ్వజం
Shame on you Twitter enraged at BCCI and Ganguly

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించడంపై ట్విట్టర్‌లో దుమారం రేగుతోంది. బీసీసీఐ, దాని చీఫ్ గంగూలీని ట్రోల్ చేస్తూ అభిమానులు విరుచుకుపడుతున్నారు. బీసీసీఐపైనా, దాని చీఫ్ గంగూలీపైనా ఉన్న గౌరవం పోయిందని, ఇప్పుడు ఇసుమంత గౌరవం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని నిప్పులు చెరుగుతున్నారు.

‘‘కోహ్లీని ఎందుకు తొలగించారు.. 95 మ్యాచుల్లో 65 విజయాలు అందించినందుకా? ప్రపంచ కప్ ఒక్క దానినే ప్రాతిపదికగా తీసుకుంటారా? అలా అయితే, ధోనీ గంగూలీ సారథ్యంలోని జట్లు ప్రపంచకప్‌లలో ఓడిపోలేదా? క్రీడల్లో కూడా రాజకీయాలు ప్రవేశించాయా?.. ఏది ఏమైనా ఇది మంచి సంకేతం కాదు’’ అంటూ గంగూలీ, బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు బీసీసీఐ, జై షా, గంగూలీలు సిగ్గుపడాలంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ20 కెప్టెన్‌గా కోహ్లీ తప్పుకున్నప్పుడే వన్డే కెప్టెన్సీ గురించి ఎందుకు ఆలోచించలేదని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. సారథ్య మార్పుపై మీడియా సమావేశం కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని, అకస్మాత్తుగా ఈ తొలగింపు ఏమిటని దుమ్మెత్తి పోస్తున్నారు. చూస్తుంటే గంగూలీ, జై షా శకం గాడితప్పినట్టుగా ఉందని నిప్పులు చెరుగుతున్నారు.

మరోవైపు, కోహ్లీ తొలగింపును ఐసీసీ సహా మాజీ క్రికెటర్లు స్వాగతించడం విశేషం. భారత వన్డే క్రికెట్‌లో ఇది నూతన శకమని ఐసీసీ అభివర్ణిస్తే.. ఇది చాలా మంచి నిర్ణయమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో ‘మెన్ ఇన్ బ్లూ’ను నడిపించేందుకు నంబర్ 45 (రోహిత్ శర్మ జెర్సీ నంబరు) సిద్ధమని ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ పేర్కొంది.

కోహ్లీ, రోహిత్‌లతో కూడిన జట్లను ద్రావిడ్ ఎలా నడిపిస్తాడో వేచి చూడాల్సిందేనని క్రికెట్ కామెంటేటర్ హర్షాభోగ్లే అన్నాడు. రెండు వేర్వేరు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమించడం వల్ల డ్రెస్సింగ్ రూములో మార్పులు తప్పవని, రోహిత్, కోహ్లీని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడంలో ద్రావిడ్ పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుందని క్రీడా విశ్లేషకుడు అయాజ్ మీనన్ అన్నారు.

More Telugu News