Peddapalli District: గోదావరిఖనిలో దారుణం.. మీ సేవ ఆపరేటర్‌ను నరికి చంపి, శరీర భాగాలను వేర్వేరు చోట్ల పడేసిన నిందితుడు

  • శరీర భాగాలను వేరుచేసిన నిందితుడు
  • పోలీసుల అదుపులో నిందితుడు
  • అతడిచ్చిన సమాచారంతో శరీర భాగాల గుర్తింపు
  • బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న బాధితుడి తల్లి
Dreaded Murder in Telangana Godavarikhani

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన నిందితుడు దొరక్కుండా ఉండేందుకు శరీర భాగాలను వేరు చేసి వేర్వేరు చోట్ల పడేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్టీపీసీ ఖాజీపల్లికి చెందిన కాంపల్లి శంకర్ (35) గోదావరిఖనిలోని విఠల్‌నగర్ మీసేవ కేంద్రంలో పనిచేస్తున్నాడు. వివాహితుడైన శంకర్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

గురువారం సాయంత్రం నుంచి జాడ లేకపోవడంతో శుక్రవారం శంకర్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శంకర్ కోసం గాలించారు. ఈ క్రమంలో నిన్న ఉదయం ఎన్టీపీసీ ప్లాంటు గోడ వద్ద మొండెం నుంచి వేరైన శంకర్ తలను గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిచ్చిన వివరాలతో వేర్వేరు చోట్ల పడేసిన శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడిని బంధువులే హత్య చేశారన్న శంకర్ తల్లి పోచమ్మ ఫిర్యాదుతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News