Ravichandran Ashwin: మోర్గాన్, అశ్విన్ జగడం.. సుదీర్ఘ ట్వీట్ చేసిన అశ్విన్

  • పరుగు తీయడం తప్పు కాదన్న భారత స్పిన్నర్
  • ఎవరి విలువలు వారికుంటాయంటూ ట్వీట్
  • ఎదుటివారిని తప్పుబట్టే హక్కు వారికి లేదంటూ ఫైర్
  • తాను గొడవ పడలేదని, తన కోసం తాను నిలబడ్డానని వివరణ
Ashwin writes a long reply on fight with Morgan

ఐపీఎల్ రెండో దశలో భాగంగా ఢిల్లీ, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఢిల్లీకి ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ మధ్య వాగ్వాదం జరిగింది. 19వ ఓవర్లో ఫీల్డర్ విసిరిన బంతి పంత్‌కు తాకి పక్కకు వెళ్లింది. ఆ సమయంలో అశ్విన్ మరో పరుగు తీశాడు.

దీనిపై మోర్గాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో క్రికెట్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు మోర్గాన్‌ వెనుక నిలబడితే, మరికొందరు అశ్విన్‌ను వెనకేసుకొచ్చారు. ఈ క్రమంలో ఈ గొడవపై అశ్విన్ స్పందించాడు. తన వాదన వినిపిస్తూ సుదీర్ఘమైన ట్వీట్ చేశాడు.

‘‘1.ఫీల్డర్ బంతి విసిరిన సమయంలోనే నేను పరుగుకు ప్రయత్నించా. బంతి పంత్‌ను తాకడం నేను చూడలేదు.
2. అది చూస్తే నేను పరిగెడతానా? కచ్చితంగా, అలా చేసే హక్కు నాకుంది
3. మోర్గాన్ అన్నట్లు నేను క్రీడకు తలవంపు తెచ్చానా? కచ్చితంగా కాదు.
4. నేను గొడవపడ్డానా? లేదు నాకోసం నేను నిలబడ్డా. నాకు టీచర్లు, తల్లిదండ్రులు నేర్పించింది అదే. మీరు కూడా మీ పిల్లలకు అదే నేర్పించండి’’ అంటూ అశ్విన్ కొన్ని అంశాలను వివరించాడు.

అంతేకాక మోర్గాన్, సౌతీల క్రికెట్ ప్రపంచంలో వారు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వారుండొచ్చని చెప్పాడు. అయితే తాము నైతికంగా గొప్పవారమని భావిస్తూ ఎదుటివారిని అవమానించేలా మాట్లాడకూడదని సలహా ఇచ్చాడు. ‘‘ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ప్రజలు దీని గురించి చర్చించుకుంటున్నారు. ఎవరు కరెక్ట్? ఎవరు కాదు అని మాట్లాడుకుంటున్నారు’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

More Telugu News