TS High Court: ఖైరతాబాద్ లో వచ్చే ఏడాది నుంచి మట్టిగణపతి.. ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం!

  • పీవోపీ విగ్రహాల వల్ల హుస్సేన్ సాగర్ కాలుష్య కాసారంగా మారుతోందని హైకోర్టు ఆవేదన
  • పీవోపీ విగ్రహాల నిమజ్జనం కుదరదన్న హైకోర్టు
  • హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
Khairatabad Ganesh Utsav Committee Taken Sensational Decision

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం విషయంలో ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తుండగా, వచ్చే ఏడాది నుంచి 70 అడుగుల మట్టిగణపతిని ప్రతిష్ఠించి, చివరికి మండపంలోని నిమజ్జనం చేయాలని నిర్ణయించింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

హుస్సేన్ సాగర్‌లో ఈ ఒక్క ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో జీహెచ్ఎంసీ పిటిషన్ దాఖలు చేసింది. నిమజ్జనానికి అనుకూలంగా హుస్సేన్ సాగర్‌లో 25 బేబీ పాండ్స్ కూడా నిర్మించామని కోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పీవోపీ విగ్రహాల వల్ల హుస్సేన్ సాగర్ కాలుష్య కాసారంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇకపై అందులో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. రసాయనాలు లేని, మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు మాత్రం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, హైకోర్టు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ నేడు విచారణకు రానుంది.

More Telugu News