Kangana Ranaut: 'తలైవి' విడుదల నేపథ్యంలో.. మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగనా రనౌత్ విన్నపం

  • ఈ నెల 10న విడుదలకానున్న 'తలైవి'
  • థియేటర్లను ఓపెన్ చేయాలని కోరిన కంగన
  • థియేటర్ల ద్వారానే కరోనా వ్యాప్తి చెందుతోందనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపాటు
Kangana Ranaut request to Maharashtra Government amid Thalaivi movie release

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన 'తలైవి' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు, ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగన ఒక విన్నపం చేసింది. థియేటర్లను వెంటనే ప్రారంభించాలని కోరింది. సినీ పరిశ్రమ చనిపోయే పరిస్థితిలో ఉందని... పరిశ్రమను బతికించేందుకు థియేటర్లను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందని... ఈ నేపథ్యంలో థియేటర్లను తెరిచి పరిశ్రమను బతికించాలని కోరింది.

మహారాష్ట్రలో రెస్టారెంట్లు, హోటళ్లు, కార్యాలయాలు, లోకల్ ట్రైన్స్ అన్నీ ప్రారంభమయ్యాయని... కానీ థియేటర్లను మాత్రం తెరవలేదని కంగన అన్నారు. సినిమా థియేటర్ల ద్వారానే కరోనా వ్యాప్తి అవుతోందనే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.  

సెప్టెంబర్ 10న 'తలైవి' సినిమా విడుదలకాబోతోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటించారు.

More Telugu News