Nara Lokesh: వివాహ వేడుక‌కు హాజ‌రైన చింత‌మ‌నేని అరెస్టు.. పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్న‌ లోకేశ్

  • పోలీసుల విధుల‌కు ఆటంకాలు అంటూ అరెస్టు
  • రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్న లోకేశ్
  • ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేని దుస్థితిలో ఉన్నారని ఆగ్ర‌హం
  • అధికార పార్టీకి కొంత మంది పోలీసులు ఊడిగం చేస్తున్నారని వ్యాఖ్య
lokesh slams ycp

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాకర్ ను విశాఖ జిల్లా చింత‌ప‌ల్లి పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ నుంచి దెందులూరు పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఏపీలో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరిగిపోతుండ‌డంతో టీడీపీ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

ఇందులో భాగంగా దెందులూరులో చింత‌మ‌నేని నిర్వ‌హించిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పోలీసుల విధుల‌కు ఆటంకాలు క‌లిగించార‌ని ఆయ‌న‌పై దెందులూరు పోలీసులు కేసు పెట్టారు. కాగా, విశాఖ‌లో నిన్న ఓ వివాహ వేడుక‌కు హాజ‌రైన స‌మ‌యంలో చింత‌మ‌నేనిని చింత‌ప‌ల్లి పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. దీంతో టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.  

'రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి అరెస్ట్ ఉదంతం తాజా ఉదాహరణ. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేని దుస్థితిలో ఉన్నారంటే అధికార పార్టీకి కొంత మంది పోలీసులు ఎంతగా ఊడిగం చేస్తున్నారో అర్థ‌మవుతుంది' అని టీడీపీ నేత‌ లోకేశ్ మండిప‌డ్డారు.

'కార్యకర్త ఇంట కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్లిన చింతమనేనిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినందుకు అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది' అని లోకేశ్ చెప్పారు.

'రాజకీయ కక్ష సాధింపున‌కు పోలీసు వ్యవస్థ ఆయుధంగా మారింది. చింతమనేని అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే ఆయన్ని విడుదల చెయ్యాలి. వైకాపా కండువా కప్పుకొని అత్యుత్సాహంతో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న కొంతమంది పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు' అని లోకేశ్ హెచ్చ‌రించారు.

More Telugu News