Maharashtra: ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీల మధ్య నుజ్జునుజ్జయిన కారు.. ముగ్గురి దుర్మరణం

  • ముంబైలోని బోర్‌ఘాట్ ప్రాంతంలో ఘటన
  • మృతుల్లో మూడేళ్ల చిన్నారి
  • ప్రమాదం జరిగిన వెంటనే కారులో చెలరేగిన మంటలు
3 killed in tragic road accident on Mumbai Pune expressway

ముంబైలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై బోర్‌ఘాట్ ప్రాంతంలో అత్యంత వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టి అదే వేగంతో దూసుకెళ్లి ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో రెండు లారీల మధ్య చిక్కుకున్న కారు నుజ్జు అయింది. ఆ వెంటనే కారులో మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్నవెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని తొలగించి జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులను జావోకిమ్ చెట్టియార్ (36), ఆయన భార్య లుయిజా (35), కుమారుడు జాజియల్ (3)గా గుర్తించారు. పూణె సమీపంలోని వాసాయి నుంచి నైగావ్‌లోని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ రమేశ్ నికమ్‌కు తీవ్ర గాయాలు కాగా కోమఠేలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

More Telugu News