COVID19: ఫేక్​ వ్యాక్సినేషన్​​ ఎఫెక్ట్​: టీకా క్యాంపులను రద్దు చేసిన బెంగాల్​ సర్కార్​

  • క్యాంపుల్లో వ్యాక్సినేషన్ కు మార్గదర్శకాలపై కసరత్తు
  • ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్న ఆరోగ్య శాఖ
  • ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో యథావిధిగా వ్యాక్సినేషన్
West Bengal Govt Cancels Vaccination Camps

ఫేక్ వ్యాక్సినేషన్ గుట్టు రట్టుకావడంతో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించే వ్యాక్సినేషన్ తప్ప.. మిగతా క్యాంపులన్నింటినీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది. ఐఏఎస్ ముసుగులో ఓ వ్యక్తి కోల్ కతాలో ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంపును నిర్వహించాడు. అందులో దాదాపు 2 వేల మంది దాకా వ్యాక్సిన్ వేయించుకున్నారు. బాధితుల్లో తృణమూల్ ఎంపీ మిమి చక్రవర్తి కూడా ఉన్నారు. ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ అని చెప్పి ప్రజలకు యాంటీ బయోటిక్ ఇంజెక్షన్లు వేసినట్టు దర్యాప్తులో తేలింది.

ఈ నేపథ్యంలోనే బెంగాల్ సర్కార్ టీకా క్యాంపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వం నిర్వహించే టీకా కార్యక్రమంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్ నిరంతరాయంగా జరుగుతుంది. వ్యాక్సినేషన్ క్యాంపులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఆ సమావేశంలో టీకా క్యాంపులపై మార్గదర్శకాలను రూపొందించనున్నారు. ఆ మార్గదర్శకాలను విడుదల చేసేంత వరకు క్యాంపులను రద్దు చేశారు.

More Telugu News