New Delhi: ఇకనుంచి ఓటున్న చోటే కరోనా టీకాలు... ఢిల్లీ ప్రభుత్వ ప్రకటన

  • ఢిల్లీలో మొత్తం 280 వార్డులు  
  • 70 వార్డుల్లో ఇవ్వాళ్టి నుంచే మొదలు
  • పోలింగ్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్
  • 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే
Delhi To Vaccinate 45 above people at Polling Centers

ఇప్పటిదాకా కరోనా వ్యాక్సిన్ల కోసం ఆసుపత్రుల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఇకపై ఢిల్లీ జనానికి ఆ అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇంటికే రేషన్ సరుకులను తెచ్చిస్తామన్న కేజ్రీవాల్ ప్రభుత్వం.. ఇప్పుడు కరోనా టీకాలను ఓటున్న చోటుకే వచ్చి వేస్తామంటోంది. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఈ కార్యక్రమం కింద వ్యాక్సిన్ వేయనుంది.

వ్యాక్సిన్ల కొరత లేకపోతే 45 ఏళ్లు దాటిన వారందరికీ.. వారికి ఓటున్న చోటనే టీకాలు వేస్తామని ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్ ప్రకటించారు. అందుకు పోలింగ్ బూత్ అధికారులు తమ తమ వార్డుల్లోని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేసేలా ఆదేశాలిచ్చారు. ఈ రోజు నుంచే ఈ కార్యక్రమం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. 280 వార్డులున్న ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టు కింద 70 వార్డుల్లోని సంబంధిత పోలింగ్ బూత్ లలో టీకాలు వేస్తామన్నారు.

వ్యాక్సినేషన్ కేంద్రాల వద్దకు ఇప్పుడు అతి తక్కువ మంది మాత్రమే వస్తున్నారని, వారి కోసం వేచి చూసే బదులు తామే వారి వద్దకు వెళ్లి టీకాలు వేయాలని నిర్ణయించామని చెప్పారు. కాబట్టి 45 ఏళ్లు దాటిన వారంతా తప్పకుండా పోలింగ్ సెంటర్ కు వెళ్లి టీకాలు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇళ్ల నుంచి పోలింగ్ బూత్ లు దగ్గర్లోనే ఉంటాయి కాబట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈజీగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఢిల్లీలో 45 ఏళ్లు పైబడినవారు 57 లక్షల మంది వరకుండగా.. అందులో 27 లక్షల మంది మొదటి డోసు టీకా తీసుకున్నారు.

More Telugu News