Jupudi Prabhakar Rao: రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలి: వైసీపీ నేత జూపూడి

  • చంద్రబాబుపై జూపూడి ఫైర్
  • రాష్ట్రంలో అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యలు
  • దళితుల కోసం ఏంచేశారో చెప్పాలని డిమాండ్
  • కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణ
Jupudi Prabhakar Rao fires on Chandrababu

వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి చూసి చంద్రబాబుకు నిద్రపట్టడంలేదని జూపూడి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పాలనలో రాజ్యాంగానికి అత్యున్నత గౌరవం లభించిందని అన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి పాలసీని సీఎం జగన్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు తన పాలనలో దళితుల కోసం ఏంచేశారో చెప్పాలని ఆయన నిలదీశారు.

రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కడ జరిగాయో చంద్రబాబు చూపించాలని అన్నారు. అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడడం చంద్రబాబు నైజం అని జూపూడి విమర్శించారు. ప్రభుత్వంపై కుట్రలు చేయడమే చంద్రబాబుకు పనిగా కనిపిస్తోందని ఆరోపించారు. దొంగలు మళ్లీ అధికారంలోకి రావడం కోసం కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని జూపూడి హెచ్చరించారు.

More Telugu News