Maharashtra: థానేలో విషాదం: ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు మృత్యువాత

  • 3.40 గంటల ప్రాంతంలో మంటలు
  • ఆసుపత్రి నుంచి 20 మందికిపైగా రోగుల తరలింపు
  • ఆసుపత్రికి చేరుకుని పరిస్థితి సమీక్షించిన మంత్రి
4 Patients Killed In Massive Fire At Private Hospital In Thane

మహారాష్ట్రలోని థానేలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు రోగులు మృత్యువాత పడ్డారు. ముంబ్రా ప్రాంతంలోని కౌశాలో ఉన్న ప్రైమ్ క్రిటికేర్ ఆసుపత్రిలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 20 మందికిపైగా రోగులను తరలించారు. ఈ క్రమంలో మరో ఆసుపత్రికి తరలిస్తున్న నలుగురు రోగులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

సమాచారం తెలిసిన వెంటనే ముంబ్రా-కల్వా ఎమ్మెల్యే, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర అవహద్ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ తెల్లవారుజామున 3.40 గంటలకు మంటలు చెలరేగాయని థానే మునిసిపల్ కార్పొరేషన్ పేర్కొంది. రెండు పైరింజన్లతో మంటలు అదుపు చేస్తున్నామని, సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించింది.

More Telugu News