COVID19: ఫ్రీ ఆక్సిజన్​ నుంచి ఐసోలేషన్​ హోమ్స్​ దాకా.. కరోనా కష్ట కాలంలో సేవలు!

  • హోం ఐసోలేషన్ కు గురుగ్రామ్ సంస్థ ఫ్రీగా ఏర్పాట్లు
  • రోజూ వంద ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తున్న స్వచ్ఛంద సంస్థ
  • పేషెంట్లను తీసుకెళ్లేందుకు ఢిల్లీ సంస్థ క్యాబ్ సేవలు
  • సకాలంలో అంబులెన్స్ ను పంపించేందుకు ఐఐటీ బాంబే విద్యార్థుల హెల్ప్ లైన్
Free oxygen cylinders to cabs private firms extend services to aid Indias battle against Covid19

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రెండున్నర లక్షలకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో మేమున్నామంటూ ప్రైవేట్ సంస్థలు, ప్రజలు చేదోడుగా నిలుస్తున్నారు. తమకు తోచినంతలో సాయం చేస్తున్నారు. కొందరు కరోనా సోకిన వారికి ఐసోలేషన్ హోమ్స్ ను ఏర్పాటు చేస్తుంటే.. మరికొందరు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తున్నారు. మరికొందరు కడుపునిండా భోజనం పెట్టి ఆకలి తీరుస్తున్నారు. ఇంకొందరు పేషెంట్లను ఫ్రీగా క్యాబుల్లో ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు. ఓ సారి ఆ కథేంటో చూసేద్ధామా!!

గురుగ్రామ్ లో ఐసోలేషన్ హోమ్స్

అహూజా రెసిడెన్సీస్.. గురుగ్రామ్ లోని అద్దె ఇళ్లు, ఇంటి కొనుగోళ్లకు సంబంధించిన వ్యాపార సంస్థ. కరోనా పేషెంట్లకు ఐసోలేషన్ హోమ్స్ ను ఏర్పాటు చేసింది. వారి ఐసోలేషన్ హోమ్స్ లో చికిత్స చేయించేందుకు మ్యాక్స్ హెల్త్ కేర్ తో ఒప్పందం చేసుకుంది. ఈ ఆపత్కాలంలో కరోనా పేషెంట్లకు తోచిన సాయం చేస్తోంది. అన్ని ఉచితంగానే అందిస్తోంది. మూడు కేటగిరీలుగా సాయం చేస్తున్నామని సంస్థ సీఈవో జైదీప్ అహూజా తెలిపారు.

మొదటిది.. కొవిడ్ నెగెటివ్ వచ్చిన వారు ముందు జాగ్రత్తగా క్వారైంటన్ కావాలనుకుంటే వారికి క్వారంటైన్ గదులను ఏర్పాటు చేశామని, ఇలాంటివి రెండు కేంద్రాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. రెండోది.. లక్షణాల్లేని కరోనా పేషెంట్లకు మూడు కేంద్రాల్లో వసతినిస్తున్నామన్నారు. మూడోది.. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిన కొవిడ్ రోగులకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేసి చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. ప్రతి విషయంలోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఎవెరా.. కరోనా పేషెంట్లకు ఉచిత క్యాబ్

ప్రకృతి ఈ– మొబిలిటీ అనే ప్రైవేట్ గ్రూప్.. ఢిల్లీ ప్రభుత్వంతో జట్టు కట్టి కరోనా పేషెంట్లను ఆసుపత్రికి తీసుకళ్లేందుకు ఉచిత క్యాబ్ సర్వీసులను అందిస్తోంది. ‘ఎవెరా’ పేరుతో క్యాబ్ సర్వీస్ ను నిర్వహిస్తోంది. 24 గంటల పాటు సేవలను అందిస్తోంది. ఉచితంగా కరోనా పేషెంట్లను తీసుకెళ్తోంది. ఆ సమయంలో డ్రైవర్లు పీపీఈ కిట్లు వేసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.


ఇందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ‘జీవన్ సేవ’ అనే యాప్ ను ప్రారంభించిందని, హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్లకు మాత్రమే ఈ యాప్ అని ప్రకృతి ఈ–మొబిలిటీ సహ వ్యవస్థాపకుడు నిమీశ్ త్రివేది చెప్పారు. ఓలా లేదా ఊబెర్ క్యాబ్ లను బుక్ చేసుకున్నట్టే జీవన్ సేవ ద్వారా క్యాబ్ ను బుక్ చేసుకోవచ్చన్నారు. ఇంటి నుంచి ఆసుపత్రి, ఆసుపత్రి నుంచి ఇంటికి సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి పికప్ అండ్ డ్రాప్ తర్వాత క్యాబ్ లను శానిటైజ్ చేస్తామన్నారు.

రోజూ వంద ఆక్సిజన్ సిలిండర్లు.. ఫ్రీగా పేషెంట్లకు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా పేషెంట్లను ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ, ముంబైల్లోని కరోనా పేషెంట్లకు ‘హేమ్ కుంత్ ఫౌండేషన్’ ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తోంది. అవసరమున్న వారందరికీ ఉచితంగా రేషన్, ఆక్సిజన్ సిలిండర్లను మానవతా దృక్పథంతో ఫ్రీగా ఇస్తున్నామని ఫౌండేషన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ డైరెక్టర్ హర్తీరథ్ సింగ్ చెప్పారు.


గత ఏడాది నెలకు వంద సిలిండర్లను  మాత్రమే పేషెంట్లకు ఉచితంగా పంపిణీ చేశామని, కానీ, ఇప్పుడు రోజూ వంద సిలిండర్లు ఇస్తున్నామని చెప్పారు. ఎవరికైనా అవసరం ఉందనిపిస్తే తమ సోషల్ మీడియా, వెబ్ సైట్ల ద్వారా సంప్రదించొచ్చని సూచించారు. 24 గంటలు తమ టీమ్ కాల్స్ ను తీసుకుంటుందని చెప్పారు.

ఫోన్ చేసిన వెంటనే అంబులెన్సులు

కొన్ని విద్యార్థి సంఘాలూ తమ వంతుగా కరోనా కష్ట కాలంలో తోడుగా నిలుస్తున్నాయి. ఐఐటీ బాంబేకి చెందిన ముగ్గురు విద్యార్థులు.. సకాలంలో అంబులెన్స్ సేవలు అందేలా  చూసేందుకు ‘హెల్ప్ నౌ’ అనే సర్వీస్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఓ అంబులెన్స్ 50 నిమిషాలకుగానీ పేషెంట్ వద్దకు చేరట్లేదు. అయితే, ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణెల్లో హెల్ప్ నౌ సర్వీసులను అందిస్తున్నారు. 8822288222, 8899889952 నంబర్లకు ఫోన్ చేసి సాయం పొందొచ్చని హెల్ప్ నౌ సహ వ్యవస్థాపకుడు శిఖర్ అగర్వాల్ చెప్పారు. తమ సేవలు ఉచితం మాత్రం కాదని, అయితే, మార్కెట్ లో ఉన్న రేట్ల కన్నా 40 శాతం తక్కువకే సేవలు అందిస్తున్నామని చెప్పారు. అంబులెన్స్ డ్రైవర్లు, అందులో ఉండే డాక్టర్లకు తాము జీతాలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

More Telugu News