PBKS: సంజూ శాంసన్ అసాధారణ పోరాటం వృథా... చివరి బంతికి ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్!

  • గత రాత్రి ముంబై వేదికగా మ్యాచ్
  • తొలుత బ్యాటింగ్ చేసి 221 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్
  • 4 పరుగుల దూరంలో ఆగిపోయిన ఆర్ఆర్
RR Defeteted by PBKS

రాజస్థాన్ రాయల్స్... ఐపీఎల్ పోటీల్లో ఈ టీమ్ కు ఎంతో చరిత్ర ఉంది. అత్యధిక పరుగులను బీట్ చేసి విజయం సాధించిన రికార్డు కూడా ఉంది. అటువంటిదే మరో మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులకు సోమవారం కనువిందు చేసింది. అయితే, ఈ దఫా ఫలితం మారింది. భారీ స్కోరును ఛేదించడంలో చివరి వరకూ పోరాడిన ఆర్ఆర్ విఫలమైంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంమ్సన్, తన అసాధారణ ఆటతీరుతో 63 బంతుల్లోనే 119 పరుగులు (12 ఫోర్లు, 7 సిక్స్ లు) బాదినా, ఆఖరి బంతికి అవుట్ కావడంతో, పంజాబ్ కింగ్స్ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఈ సీజన్ లో ఇదే అత్యధిక స్కోరు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 50 బంతుల్లో 91 పరుగులు చేయగా, దీపక్ హుడా 28 బంతుల్లో 64 పరుగులు చేసి, బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఆపై 222 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్, క్రమంగా వికెట్లను కోల్పోతున్నా, మరో ఎండ్ లో సంజూ శాంసన్ విధ్వంసాన్నే సృష్టించాడు. పది ఓవర్లు ముగిసేవరకు రెండు వికెట్లు కోల్పోయి, 89 పరుగులు చేసిన ఆర్ఆర్, ఆపై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ముఖ్యంగా 13, 14 ఓవర్లలో భారీగా పరుగులను పిండుకుంది. సంజూకు బట్లర్ (25 పరుగులు), శివమ్ దూబే (23) పరుగులు) అండగా నిలువగా, మ్యాచ్ ఆఖరు బంతి వరకూ సాగింది.

చివరి ఓవర్ ను అర్హదీప్ వేయగా, ఆఖరి రెండు బంతులకు ఐదు పరుగులు అవసరం అయ్యాయి. తొలి బంతికి సింగిల్ తీసే అవకాశం లభించినా, సంజూ, దాన్ని తీసుకోలేదు. ఆఖరి బంతిని సిక్స్ గా మలచాలని అతను చేసిన ప్రయత్నాన్ని లాంగ్ ఆన్ లో ఉన్న దీపక్ హుడా అడ్డుకుని, గాల్లో వస్తున్న బంతిని క్యాచ్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ పరాజయం ఖరారైంది.

కాగా, నేడు కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య చెన్నై వేదికగా, రాత్రి 7.30కి మరో మ్యాచ్ జరుగనుంది.

More Telugu News