Maharashtra: ఓవైపు వెల్లువలా కరోనా కేసులు... లాక్ డౌన్ పై ఎటూ తేల్చుకోలేకపోతున్న మహారాష్ట్ర

  • మహారాష్ట్రలో 50 వేలకు పైగా రోజువారీ కేసులు
  • అఖిలపక్షం నిర్వహించిన సీఎం థాకరే
  • లాక్ డౌన్ పై భిన్నాభిప్రాయాలు
  • సీఎం నిర్ణయానికి మద్దతిస్తామన్న ఫడ్నవీస్
Maharashtra govt yet to decide on lock down

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా మహారాష్ట్రలోనే కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో నమోదయ్యే కరోనా కేసుల్లో మహారాష్ట్ర వాటానే సగం ఉంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిని కరోనా అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించేందుకు అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం ఉద్ధవ్ థాకరే నిన్న అఖిపక్ష సమావేశం ఏర్పాటు చేసి లాక్ డౌన్ పై చర్చించారు. అయితే ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు.

ఇవాళ కూడా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం థాకరే కొవిడ్ టాస్క్ ఫోర్స్ తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో బెడ్లు, రెమ్ డెసివిర్ ఔషధాల అందుబాటుపై చర్చించారు. రాష్ట్రంలో లాక్ డౌన్/ఆంక్షలు విధించే అంశంపైనా తన ఆలోచనలు పంచుకున్నారు.

కాగా, రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపుకు మంత్రులు మద్దతు పలుకుతున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా కొన్నిరోజుల పాటు పూర్తిస్థాయిలో ఆంక్షలు అమలు చేయాలని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే, మరో మంత్రి విజయ్ వడ్డేటివర్ సూచించారు. అయితే, లాక్ డౌన్ పరిస్థితులు నివారించడానికి ఉన్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుందని మంత్రి రాజేశ్ తోపే అన్నారు. అటు, విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ సైతం సీఎం లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంటే తాము మద్దతు ఇస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో గత కొన్నిరోజులుగా 50 వేలకు అటూఇటూగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 4న 57,074... ఏప్రిల్ 5న 47,288... ఏప్రిల్ 9న 58,993... ఏప్రిల్ 10న 55,411 కేసులు వెల్లడయ్యాయి.

More Telugu News