Sarath Kumar: కమలహాసన్ పార్టీతో పొత్తుకు ప్రతిపాదన చేశాం: నటుడు శరత్ కుమార్

  • తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి
  • కమల్ తో భేటీ అయిన శరత్ కుమార్
  • నిర్ణయం కమల్ కే వదిలేశామని వెల్లడి
  • సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం
Sarath Kumar met Kamal Haasan for alliance in upcoming assembly elections

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో వివిధ పార్టీలు పొత్తు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాగా, సీనియర్ నటుడు, ఆలిండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే) అధినేత శరత్ కుమార్ తాజాగా కమలహాసన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం శరత్ కుమార్ మాట్లాడుతూ, కమల్ పార్టీ మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్ఎం)తో పొత్తుకు ప్రతిపాదన చేశామని వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎంతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్న విషయాన్ని కమల్ కు వివరించానని, అయితే పొత్తుపై ఏం నిర్ణయం తీసుకుంటారన్నది వారికే వదిలేశామని తెలిపారు. సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇక, ఇండియా జననాయగ కట్చి (ఐజేకే) పార్టీతో తమ పొత్తు ఖరారైందని శరత్ కుమార్ వెల్లడించారు. శరత్ కుమార్ స్థాపించిన ఏఐఎస్ఎంకే పార్టీ అధికార అన్నాడీఎంకే మిత్రపక్షంగా గుర్తింపు పొందింది. శరత్ కుమార్ తాజా ప్రయత్నాలు చూస్తుంటే అధికార పక్షానికి దూరం జరిగినట్టు అర్థమవుతోంది.

More Telugu News