KCR: ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.. లేకపోతే తొక్కి పడేస్తా: కేసీఆర్ వార్నింగ్

  • కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడ్డారు
  • చంద్రబాబు పొలాలను ఎండబెట్టినా ఒక్కరూ మాట్లాడలేదు
  • తెలంగాణ కోసం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా రాజీనామా చేయలేదు
KCR gives warning to Congress and BJP leaders

తెలంగాణ పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా కాంగ్రెస్ పార్టీకి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడ్డారని, ఇప్పుడు నీతులు చెపుతున్నారని అన్నారు.

ప్రాజెక్టులు కడితే కమిషన్ల కోసమే కట్టారని అంటున్నారని... మీరు కమిషన్ల కోసమే నాగార్జున సాగర్ డ్యామ్ కట్టారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని... కాంగ్రెస్, బీజేపీ హద్దుమీరి మాట్లాడితే ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు. ఆ రెండు పార్టీల నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. లేకపోతే తొక్కి పడేస్తామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. కల్యాణలక్ష్మి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. తమది నామినేటెడ్ ప్రభుత్వం కాదని, ప్రజా ప్రభుత్వమని అన్నారు.

 గతంలో ప్రాజెక్టులన్నీ ఆంధ్రకు అనుకూలంగా కడుతుంటే... కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని నిలదీశారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా రాజీనామా చేయలేదని అన్నారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసిన పాపం కాంగ్రెస్ నేతలదే అని మండిపడ్డారు.

ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఉచితంగా కేసీఆర్ కిట్లు ఇస్తున్నామని కేసీఆర్ అన్నారు. పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్ లో దళితుల కోసం ప్రత్యేక కేటాయింపులు చేస్తామని తెలిపారు. సీఎం దళిత ఎంపవర్ మెంట్ పేరుతో వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పారు.

చంద్రబాబు హయాంలో పొలాలను ఎండబెట్టినా ఒక్కరూ మాట్లాడలేదని... ఇప్పుడు తాము అన్నీ చేస్తున్నా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. తాను చెప్పే మాటలు అబద్ధమైతే నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ ను ఓడించాలని... నిజమని నమ్మితే ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు.

More Telugu News