Sai Pallavi: అందుకే ఆ యాడ్‌లో నటించలేదు: రూ.2 కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఘటనపై హీరోయిన్ సాయి పల్లవి

  • ఓ ఫెయిర్‌నెస్‌ క్రీమ్ సంస్థ నుంచి ఆఫర్
  • నేను సింపుల్ గా వుండడానికి ఇష్టపడతా 
  • అందం, శరీర రంగును ఆధారంగా చేసుకుని కొందరు మనల్ని చులకనగా చూస్తారు
  • టీనేజీ అమ్మాయిల్లో ప్రేరణ నింపాలని నిర్ణయించుకున్నా
thats why rejected offer

గతంలో రూ.2 కోట్ల ఆఫర్‌తో వచ్చిన ఓ ఫెయిర్‌నెస్‌ క్రీమ్ యాడ్‌లో తాను ఎందుకు నటించలేదన్న విషయాన్ని హీరోయిన్ సాయి పల్లవి వివరించి చెప్పింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...  తాను సింపుల్‌గా ఉండడానికే ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. గతంలో వచ్చిన ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ యాడ్ ఆఫర్‌ను తిరస్కరించడం అనేది పూర్తిగా తన వ్యక్తిగతమైన ఆలోచన అని చెప్పింది.

సమాజంలో అందం, శరీర రంగును ఆధారంగా చేసుకుని మనల్ని చులకనగా చూసే ఫ్రెండ్స్‌ను, బంధువులను చూశానని తెలిపింది. తాను నటించిన సినిమా ప్రేమమ్ కు ముందు తన ముఖంపై మొటిమలు తగ్గడానికి చాలా రకాల క్రీమ్స్‌ లను వాడానని, ఆ మొటిమల కారణంగా తాను ఇంట్టోంచి బయటకు వెళ్లేదాన్నే కాదని చెప్పింది.

తన మొటిమలను మాత్రమే చూసి ఇతరులు ఎందుకు మాట్లాడుతున్నారని ఆలోచించేదాన్నని తెలిపింది. తన కళ్లలోకి చూసి ఎందుకు మాట్లాడడం లేదని అనుకునేదాన్నని చెప్పింది. అయితే, ‘ప్రేమమ్‌’ సినిమాలో నటించిన తర్వాత  ప్రేక్షకులు తనను ఇష్టపడ్డారని, అంతేగాక, తన నుంచి టీనేజ్ అమ్మాయిలు చాలా మంది ప్రేరణ పొందారని వివరించింది. సమాజంలో వాళ్లు ఒంటరి కాదని తాను నిరూపించాలనుకున్నానని చెప్పుకొచ్చింది.

మరోవైపు తన సోదరి తెల్లగా మారడం కోసం ఇష్టంలేని ఆహార పదార్థాలను తినేదని చెప్పింది. ఆమెలో ప్రేరణ నింపడానికైనా తాను తనలానే ఉండాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. అందుకే తాను అప్పట్లో ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ యాడ్ లో నటించలేదని చెప్పుకొచ్చింది.

More Telugu News