కోర్టు హెచ్చరికలతో వెనక్కు తగ్గిన రజనీకాంత్... ప్రాపర్టీ ట్యాక్స్ పిటిషన్ విత్ డ్రా!

Rajanikanth With Draw Petion on Property Tax
  • చెన్నైలో రజనీ పేరిట మ్యారేజ్ హాల్
  • మార్చి నుంచి ఖాళీగా ఉన్న రాఘవేంద్ర మండపం
  • ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించలేమని పిటిషన్
  • జరిమానా ఎదుర్కోవాల్సి వుంటుందన్న కోర్టు  
చెన్నై నగరంలో ఉన్న రాఘవేంద్ర కల్యాణ మండపానికి చెల్లించాల్సిన రూ. 6.50 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కోర్టును ఆశ్రయించిన స్టార్ హీరో రజనీకాంత్ వెనక్కు తగ్గారు. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును కట్టాల్సిందేనని, లేకుంటే రజనీకాంత్ జరిమానాను ఎదుర్కోవాల్సి వుంటుందని మద్రాస్ హైకోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. కోర్టు హెచ్చరికల తరువాత, తన క్లయింట్ పిటిషన్ ను వెనక్కు తీసుకున్నారని రజనీ తరఫు న్యాయవాది వెల్లడించారు.

కోడంబాక్కం పరిధిలో ఉన్న రాఘవేంద్ర మండపానికి 2019-20లో చెన్నై కార్పొరేషన్ రూ. 6.5 లక్షల ఆస్తి పన్ను కట్టాలని నోటీసులు పంపగా, మార్చి నుంచి లాక్ డౌన్ కారణంగా ఏ విధమైన కార్యక్రమాలూ అక్కడ జరగలేదని, దీంతో ఆదాయం రానందున పన్ను కట్టలేమని కోర్టులో పిటిషన్ వేశారు.

ఇదే విషయాన్ని అధికారులకు చెప్పినా వారు స్పందించలేదని అన్నారు. మార్చి 24 నుంచి అన్ని మ్యారేజ్ హాల్స్ బుకింగ్స్ నూ ప్రభుత్వం రద్దు చేసిందని కూడా గుర్తు చేశారు. చెన్నై మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 1919లోని సెక్షన్ 105ను ఉదహరిస్తూ, ఆస్తి పన్నును తగ్గించాలని అన్నారు. అయితే, విచారణ అనంతరం రజనీ అపీల్ ను కోర్టు తోసిపుచ్చింది.

తాజాగా మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ తరఫు న్యాయవాది విజయన్ సుబ్రమణియన్, "50 శాతం వరకూ ప్రాపర్టీ ట్యాక్స్ ను తగ్గించే అవకాశం చట్టంలో ఉంది. ఏదైనా ప్రాపర్టీని వినియోగించకుండా ఖాళీగా ఉంచితే సగం పన్ను కడితే సరిపోతుందని వుంది. ఆ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తాం. మా పిటిషన్ ను వెనక్కు తీసుకుంటున్నట్టు న్యాయమూర్తికి తెలియజేశాం" అన్నారు.

కాగా, ఇదే విషయమై స్పందించిన ప్రాపర్టీ ట్యాక్స్ అధికారులు, చట్టంలో పన్ను తగ్గింపు అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తమకు తెలియదని, అయితే, ఈ నెల 15లోగా పన్ను చెల్లించే వారికి డిస్కౌంట్ ను ఇస్తున్నామని, లేకుంటే జరిమానా తప్పదని వ్యాఖ్యానించడం గమనార్హం.
Go Back to Shorts
Court
Rajanikanth
Property Tax
Fine
With draw

More Telugu News