Delhi Capitals: ఆర్సీబీపై ఘన విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ కు వెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్!

  • తొలుత బ్యాటింగ్ చేసి 196 పరుగులు చేసిన ఢిల్లీ జట్టు
  • 137 పరుగులకే పరిమితమైన కోహ్లీ సేన
  • 8 పాయింట్లతో అగ్రస్థానానికి ఢిల్లీ కాపిటల్స్
Delhi Capitals in Top after Win Over RCB

గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ టీమ్ ఘన విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాట్స్ మెన్లు తొలుత బ్యాటింగ్ లో రాణించగా, ఆపై మిగతా పనిని బౌలర్లు, ఫీల్డర్లు పూర్తి చేశారు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 196 పరుగులు చేసింది. ఓపెనర్లు పృధ్వీషా 42, శిఖర్ ధావన్ 32లు బలమైన పునాది వేయగా, చివర్లో వచ్చిన స్టోయినిస్ 26 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్స్ లతో 53 పరుగులు చేయడంతో డీసీ జట్టు భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ముందుంచింది.

ఆపై 197 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (43) మినహా మరెవరూ మెరుగైన ప్రదర్శన చేయలేదు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లను కోల్పోయిన ఆర్సీబీ 137 పరుగులకు మాత్రమే పరిమితమై, పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ కు 2 వికెట్లు, మొయిన్ అలీ, ఉదానాకు చెరో వికెట్ లభించాయి. ఈ విజయం ఢిల్లీకి నాలుగోది కాగా, 8 పాయింట్లతో అగ్రస్థానంలోకి వెళ్లింది. రాయల్ చాలెంజర్స్ కు ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.

More Telugu News