Chandrababu: సమగ్ర విచారణ జరిపించాల్సిందే!: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదంపై ఏపీ నేతల స్పందన

  • మృతుల కుటుంబాలకు సానుభూతి
  • క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని డిమాండ్
  • ప్రమాద బాధ్యత ప్రభుత్వానిదేనని విమర్శ
  • బిజీగా ఉండే సెంటర్‌లో కొవిడ్‌ కేంద్రం నిర్వహించడం తప్పని వ్యాఖ్య 
ap leaders demad probe into vijayawada fire accident

విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై పలువురు ఏపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరిన విషయం తెలిసిందే.
 
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని ఆయన అన్నారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

విజయవాడ అగ్నిప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడం గురించి తెలుసుకుని షాకయ్యానని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

'విజయవాడ కొవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను. ఈ ఘటన పై వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను' అని కేశినేని నాని పేర్కొన్నారు.  
 
'విజయవాడలోని కొవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరగడం తీవ్ర దిగ్భ్రాంతికరం. ప్రమాదంలో పలువురు కరోనా రోగులు మృతి చెందడం బాధాకరం. మృతుల  కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి' అని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు.
 
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు  ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పేర్కొన్నారు. కరోనా రోగులపై ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలని, కొవిడ్‌ను ఎదుర్కోవడమే సర్కారు కర్తవ్యమని చెప్పారు. కొవిడ్ కేంద్రంలో ప్రమాద బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. బిజీగా ఉండే సెంటర్‌లో కొవిడ్‌ కేంద్రం నిర్వహించడం తప్పని విమర్శించారు.

More Telugu News