Sushant Singh Rajput: సుశాంత్ నుంచి నేను తీసుకున్న ఆస్తి ఇదే... ఈడీ ముందు రియా చక్రవర్తి!

  • సుశాంత్ రాసిన లేఖను ఈడీ ముందుంచిన రియా
  • కృతజ్ఞతలు చెబుతూ సుశాంత్ రాసినట్టున్న లెటర్
  • అది అతను రాసిందేనా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్న ఈడీ
ED Records Rhea Statement

ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆస్తిని రియా చక్రవర్తి కాజేసిందని ఆరోపణలు వస్తున్న వేళ, ఈడీ విచారణలో భాగంగా, తాను అతన్నుంచి ఎటువంటి ఆస్తి పాస్తులను తీసుకోలేదని, అతన్నుంచి తాను ఓ లేఖను, అతను తాగిన మంచి నీళ్ల బాటిల్ ను మాత్రమే తీసుకున్నానని ఆమె చెప్పింది.సుశాంత్ రాసినట్టుగా రియా చెబుతూ, ఓ లేఖను ఈడీ అధికారుల ముందుంచింది. ఇప్పుడు ఆ లేఖను సుశాంత్ రాశారా? అది ఆయన దస్తూరీయేనా? అన్న విషయాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.


కాగా, ఈ లేఖలో "నా జీవితం పట్ల నేను కృతజ్ఞుడిని. బిల్లు, బెబు, సర్, మేడమ్, ఫడ్జ్ నా జీవితంలో ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని" అని ఉంది. బిల్లు అంటే షోయుక్ చక్రవర్తి, బెబూ అంటే తానేనని, సర్ అంటే తన తండ్రని, మేడమ్ అంటే తన తల్లని, ఫడ్జ్ అంటే సుశాంత్ పెట్ డాగ్ అని రియా చెప్పింది. ఈ లేఖ కల్పితమా? లేక సుశాంత్ స్వయంగా రాశాడా? అన్న విషయంపై అధికారులు దృష్టి సారించారు. ఇక సుశాంత్ నుంచి తాను డబ్బులు తీసుకోలేదని, తన ఆదాయం నుంచే తన ఖర్చులు తీర్చుకున్నానని కూడా రియా చెప్పినట్టు తెలుస్తుండగా, ఈడీ అధికారులు రియా వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 

More Telugu News