Chandrababu: విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డిని మళ్లీ అరెస్ట్ చేయడం ముమ్మాటికీ కక్షసాధింపే: చంద్రబాబు

  • నిన్న కడప జైలు నుంచి ప్రభాకర్ రెడ్డి విడుదల
  • తాడిపత్రిలో ఈ సాయంత్రం అరెస్ట్
  • రాక్షస పాలన అంటూ చంద్రబాబు ఆగ్రహం
Chandrababu responds very angrily on JC Prabhakar Reddy arrest

నిన్న కడప జైలు నుంచి విడుదలైన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డిని మళ్లీ అరెస్ట్ చేయడం ముమ్మాటికీ కక్షసాధింపేనని మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అక్రమ అరెస్ట్ జగన్ రాక్షస పాలనకు నిదర్శనం అని విమర్శించారు.

కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నాయకులపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసిన విజయసాయిరెడ్డి వంటి వారిని వదిలేశారని, జేసీ కుటుంబ సభ్యులపై మాత్రం తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాభిమానం ఉన్న నాయకులను నియంతృత్వ పోకడలతో అడ్డుకోలేరని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News