Jagan: ఏపీలో అక్టోబరు 15 నుంచి కాలేజీలు... సెప్టెంబరులో కామన్ ఎంట్రన్స్ టెస్టులు

CM Jagan reviews on higher education and common entrance tests
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ ఇవాళ ఉన్నత విద్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కళాశాలల రీఓపెనింగ్, కామన్ ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణపై జగన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబరులో కామన్ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించాలని, ఆపై అక్టోబరు 15 నుంచి కాలేజీలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మూడేళ్ల, నాలుగేళ్ల కాల వ్యవధి కలిగిన డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటిస్ విధానం తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలని, అనంతరం మరో ఏడాది పాటు స్కిల్ డెవలప్ మెంట్, ఉపాధి కల్పన కోర్సుల బోధన జరపాలని తెలిపారు. ఆ తర్వాతే అది డిగ్రీ ఆనర్స్ గా పరిగణించబడుతుందని సీఎం వెల్లడించారు. అయితే, అడ్మిషన్ సమయంలోనే విద్యార్థి సాధారణ డిగ్రీ కోర్సులో చేరాలనుకుంటున్నాడా? లేక ఆనర్స్ డిగ్రీ కోర్సులో చేరాలనుకుంటున్నాడా? అనే దానిపై దరఖాస్తులో ఆప్షన్ ఉంటుందని వివరించారు.

ఏదైనా కాలేజీ అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించవద్దని, కఠినచర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నందున కచ్చితంగా గ్రాస్ ఎన్ రోల్ మెంట్ పెరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Jagan
Colleges
Higher Education
Common Entrance Test
Andhra Pradesh

More Telugu News