Sushant Singh Rajput: చనిపోయే ముందు సుశాంత్ తన గురించి తాను గూగుల్ లో విపరీతంగా సెర్చ్ చేశాడు: ముంబయి పోలీసులు

  • ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్
  • కొన్ని రోజుల ముందే సుశాంత్ మాజీ మేనేజర్ బలవన్మరణం
  • దర్యాప్తు వివరాలు వెల్లడించిన పోలీసులు
Mumbai police reveals details of Sushant death investigation

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై దర్యాప్తు జరిపిన ముంబయి పోలీసులు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తన మాజీ మేనేజర్ దిశా సలియా జూన్ 9న మరణించగా, ఆమె గురించి గూగుల్ లో విపరీతంగా సెర్చ్ చేశాడని, ఆ తర్వాత చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన గురించి తాను గూగుల్ లో బాగా సెర్చ్ చేశాడని తెలిపారు.

దీన్నిబట్టి దిశా సలియా ఆత్మహత్య వ్యవహారంలో తన గురించి ప్రచారం జరుగుతోందన్న ఆందోళన సుశాంత్ లో ఏర్పడినట్టు అర్థమవుతోందని, అందుకే తామిద్దరి పేర్లతో గూగుల్ లో సెర్చ్ చేసి ఉంటాడని అభిప్రాయపడ్డారు. ఈ వివరాలు సుశాంత్ మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ డేటాను విశ్లేషించడం ద్వారా తెలుసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.

"అతడు బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ మానసిక రుగ్మతల నుంచి బయటపడేందుకు మందులు వాడుతున్నట్టు వెల్లడైంది. సుశాంత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను గుర్తించడమే మా దర్యాప్తు ముఖ్య ఉద్దేశం" అని ముంబయి పోలీస్ చీఫ్ పరమ్ వీర్ సింగ్ తెలిపారు. ఈ వ్యవహారంలో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

More Telugu News