Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ... దర్శనాలకు 5 వేల మందిలోపే!

  • తిరుమలపై మరోసారి కరోనా ప్రభావం
  • గురువారం 4,834 మంది దర్శనానికి
  • రేపు గరుడ పంచమి సేవ ఏకాంతం
No Rush in Tirumala

కరోనా ప్రభావం తిరుమలపై మరోసారి పడింది. తిరుపతిలో లాక్ డౌన్ అమల్లోకి రావడం, స్థానికంగా దర్శన టికెట్లు మంజూరు చేయకపోవడంతో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గురువారం 4,834 మంది మాత్రమే స్వామిని దర్శించుకున్నారు. వీరిలో 1,589 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ద్వారా రూ. 43 లక్షల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా టికెట్లను ముందుగా బుక్ చేసుకున్న వారిలోనూ పలువురు దర్శనానికి రావడం లేదని తెలిపారు.

కాగా, రేపు గరుడ పంచమి కావడంతో, అధికారులు ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి గరుడపంచమి నాడు, తనకు ఇష్టమైన గరుడ వాహనంపై స్వామివారు తిరు మాఢ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వాల్సివుంది. అయితే, కరోనా కారణంగా, ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ సేవను ఏకాంతంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఈ వేడుకలు జరుగనున్నాయని అధికారులు వెల్లడించారు.

More Telugu News