మెగా డీఎస్సీ అద్భుతంగా నిర్వహించారు: నారా లోకేశ్‌ను ప్రశంసించిన ఢిల్లీ మంత్రి

AP Mega DSC conducted wonderfully Delhi Minister praises Nara Lokesh
  • ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహణ పట్ల ఆశ్చర్యపోయిన ఢిల్లీ మంత్రి శిర్సా
  • ఢిల్లీలో టీచర్ రిక్రూట్‌మెంట్ అంటే కేసులేనని, ఏపీ విధానం ఆదర్శనీయమని కితాబు
  • చంద్రబాబు ఒక విశ్వవిద్యాలయం లాంటి వారని కొనియాడిన ఢిల్లీ మంత్రి
  • ఏపీ పారిశ్రామిక విధానాలు, స్మార్ట్ గవర్నెన్స్‌పై ఆసక్తి చూపిన ఢిల్లీ బృందం
  • ఢిల్లీకి సహకారం అందించేందుకు సిద్ధమని స్పష్టం చేసిన మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా టీచర్ పోస్టులను ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా, అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన తీరు అద్భుతమని ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మన్‌జిందర్ సింగ్ శిర్సా ప్రశంసించారు. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాలనా దక్షతను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్‌లతో శిర్సా నేతృత్వంలోని ఢిల్లీ ప్రతినిధి బృందం భేటీ అయింది.

ఈ సందర్భంగా శిర్సా మాట్లాడుతూ, "ఢిల్లీలో టీచర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. నియామకాలు మొదలుపెట్టగానే కోర్టు కేసులు, ఫిర్యాదులు, గందరగోళంతో ప్రక్రియ మొత్తం స్తంభించిపోతుంది. అలాంటిది ఏపీలో ఇంత పెద్ద సంఖ్యలో నియామకాలు ఎలా సాఫీగా పూర్తి చేయగలిగారు?" అని మంత్రి లోకేశ్ ను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ విజయం సాధించినందుకు లోకేశ్ కు ఆయన అభినందనలు తెలిపారు.

దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ, పక్కా ప్రణాళికతో, సాంకేతికతను వాడుకుని డీఎస్సీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని వివరించారు. ఈ ప్రక్రియపై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేసినా, కోర్టులలో కనీసం ఒక్క చిన్న అక్రమం జరిగిందని కూడా నిరూపించలేకపోయాయని తెలిపారు. విద్యాశాఖ తనకు అత్యంత ఇష్టమైనదని, త్వరలోనే మరో 3 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరగడం వల్లే ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారని, ఇది తాము చేపట్టిన సంస్కరణల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించేందుకు 'లీప్' యాప్‌ను కూడా రూపొందించినట్లు వివరించారు.

చంద్రబాబు ఒక విశ్వవిద్యాలయం

ఏపీ పర్యటనలో భాగంగా ఇక్కడి పారిశ్రామిక విధానాలు, పాలనా సంస్కరణలను అధ్యయనం చేస్తున్నామని శిర్సా తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామికాభివృద్ధి, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) వంటి అంశాల్లో ఏపీ దేశానికే మార్గదర్శిగా నిలిచిందన్నారు. డేటాను ఇంత సమర్థవంతంగా వాడుకుని సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక దార్శనికుడని, అభివృద్ధికి ఆయనో విశ్వవిద్యాలయం లాంటి వారని ప్రశంసించారు. "మీ విశ్వవిద్యాలయంలో మాకు కూడా అడ్మిషన్ ఇవ్వండి" అని ఆయన చమత్కరించారు. అమరావతి నిర్మాణం అద్భుతంగా ఉందని, భవిష్యత్తులో ఇది ప్రపంచంలోనే గొప్ప నగరంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

డేటా డ్రివెన్ గవర్నెన్స్, స్మార్ట్ గవర్నెన్స్ వంటి అంశాల్లో ఢిల్లీ ప్రభుత్వానికి ఏపీ సహకారం అందించాలని శిర్సా కోరారు. ఇందుకు మంత్రి నారా లోకేశ్ సానుకూలంగా స్పందించి, పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. అనంతరం ఢిల్లీ ప్రతినిధి బృందాన్ని మంత్రులు సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఢిల్లీ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి సజ్జన్ సింగ్ యాదవ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Nara Lokesh
AP Mega DSC
Manjinder Singh Sirsa
Andhra Pradesh Teacher Recruitment
Chandrababu Naidu
Amaravati Governance

More Telugu News