కేరళలో దారుణం.. ఖరీదైన గ్యాడ్జెట్ల కోసం బంధువునే హత్య చేయించిన బాలిక

Brutality in Kerala Minors kill elderly man for expensive gadgets
  • ఐఫోన్, బైక్‌ల కోసం బంధువును హత్య చేయించిన 13 ఏళ్ల బాలిక
  • ముగ్గురు మైనర్ బాలుర సహాయంతో దారుణానికి పాల్పడిన వైనం
  • కేరళలోని కరువట్టాలో వెలుగుచూసిన దారుణ ఘటన
  • పరీక్షకు వెళ్లాలంటూ నటించి పోలీసులకు అనుమానం కలిగించిన బాలిక
  • దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు కారంపొడి చల్లిన నిందితులు
ఖరీదైన ఐఫోన్, లగ్జరీ బైక్‌లను కొనుగోలు చేయాలనే దురాశతో ఓ 13 ఏళ్ల మైనర్ బాలిక తన బంధువునే హత్య చేయించిన దారుణ ఘటన కేరళలో వెలుగుచూసింది. ముగ్గురు మైనర్ల సహాయంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలప్పుజ జిల్లా హరిపాడ్ సమీపంలోని కరువట్టాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం, శివంకుట్టి చెట్టియార్ (65) అనే వృద్ధుడు కరువట్టాలోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. బంధువైన మైనర్ బాలిక కూడా వృద్ధుడి ఇంట్లోనే ఉంటూ చదువుకొంటోంది. శనివారం రాత్రి ఆయన భార్య, కుమార్తె ప్రసవం నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారు. శివంకుట్టి ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన బాలిక, తన స్నేహితులతో కలిసి హత్యకు పథకం రచించింది. డబ్బు, బంగారంపై కన్నేసిన ఆ బాలిక... కొల్లాం నుంచి వచ్చిన తన ముగ్గురు మైనర్ స్నేహితులకు బాధితుడి ఇంటికి దారి చూపించడంతో పాటు అవసరమైన సమాచారాన్ని అందించింది.

శనివారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత నిందితులు ఆ ఇంటికి చేరుకున్నారు. శివంకుట్టి కాళ్లు, చేతులను బట్టలతో కట్టేసి, మెడకు మరో గుడ్డతో ఉరిబిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం గదిలోని బీరువా పగలగొట్టి బంగారం, నగదుతో పరారయ్యారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ఘటనా స్థలంలో నేలపై, తలుపుల వద్ద కారంపొడి చల్లారు.

సోమవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో రక్తపు మరకల ఉన్నప్పటికీ, ఆ బాలిక ఏమాత్రం చలించకుండా పరీక్ష రాసేందుకు పాఠశాలకు వెళ్లాలని పట్టుబట్టింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఓ మహిళా సర్కిల్ ఇన్స్‌పెక్టర్, బాలికను లోతుగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన సూచనల మేరకే ఈ హత్య జరిగినట్లు ఆమె అంగీకరించింది. బాలికకు ఐఫోన్, బాలురకు బైక్‌లు కొనాలనే దురాశతో పాటు, బాధితుడిపై ఉన్న పాత కక్షలు కూడా ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

నలుగురు మైనర్లనూ అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నారు. ఈ ఘటనలో డ్రగ్స్ కోణం ఉందా అనే అంశంపై కూడా దర్యాప్తు సాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అలప్పుజ మెడికల్ కాలేజీకి తరలించారు.
Advertisement
Sivamkutty Chettiyar
Kerala Minor Murder Case
Alappuzha Crime News
Teenagers Kill Relative for iPhone

More Telugu News