పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బీసీలకు వెన్నుదన్ను.. అసెంబ్లీలో చంద్రబాబు చారిత్రక ప్రకటన

Chandrababu Naidu historic announcement in Assembly supporting BCs from Panchayat to Parliament
  • స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరణ
  • అసెంబ్లీ వేదికగా చారిత్రక నిర్ణయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
  • రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్‌ల ఏర్పాటు, మేయర్లు, ఛైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు
  • బీసీ రిజర్వేషన్లు తగ్గించి గత ప్రభుత్వం ద్రోహం చేసిందన్న ముఖ్యమంత్రి
  • పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీలకు అండగా ఉంటామని స్పష్టీకరణ
"పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల సామాజిక, రాజకీయ సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. మంగళవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ కేబినెట్ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని సీఎం ప్రకటించగానే సభ "జయహో బీసీ" నినాదాలతో దద్దరిల్లింది. ఈ నిర్ణయంతో కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించుకుందని ఆయన అన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, బీసీ రిజర్వేషన్ల కోసమే ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లను బీసీలకు వర్తింపజేయనున్నట్టు ప్రకటించారు. 

ఉమ్మడి రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం స్ఫూర్తితో, నిబంధనలకు లోబడే ఈ పెంపును అమలు చేస్తున్నామని వివరించారు. 1995, 2001, 2006, 2013 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 34 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఆయన సభకు గుర్తుచేశారు. ఈ 34 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన కోరారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. 1984లో ఎన్టీఆర్ బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, 73, 74వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తితో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 'యాక్ట్ ఆఫ్ 5' కింద దాన్ని 34 శాతానికి పెంచామని తెలిపారు. 

తమ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేయడం వల్లే ఎర్రన్నాయుడు, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, దేవేందర్ గౌడ్, అయ్యన్నపాత్రుడు వంటి లెజెండరీ నాయకులు బీసీ వర్గాల నుంచి ఎదిగారని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రోత్సాహం అందిస్తే ఎంపీటీసీ స్థాయి నేత కూడా ఎంపీగా ఎదగొచ్చని, కర్నూలు జిల్లాకు చెందిన బస్తిపాటి నాగరాజును ఎంపీగా గెలిపించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

బీసీ రిజర్వేషన్లతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా సీఎం ప్రకటించారు. సుస్థిర పాలన కోసం పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికను మళ్లీ ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తామని వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం 13గా ఉన్న జిల్లా ప్రజా పరిషత్‌ల సంఖ్యను 28కి పెంచుతున్నట్లు తెలిపారు. 16వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.2,300 కోట్ల గ్రామీణ, రూ.1,562 కోట్ల పట్టణ గ్రాంట్లు పొందాలంటే స్థానిక ఎన్నికలు నిర్వహించడం అత్యవసరమని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు, గ్రామీణ వృత్తులకు బీసీలే వెన్నెముక అని సీఎం కొనియాడారు. వారి నైపుణ్యానికి సాంకేతికతను జోడించి ప్రపంచానికి పరిచయం చేస్తామన్నారు. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను అభివృద్ధి చేసి నాణ్యమైన విద్య అందిస్తామని, విద్య, ఉపాధి, నైపుణ్యం ద్వారా వారిని ఉన్నత స్థానంలో నిలబెడతామని హామీ ఇచ్చారు. 

బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదని, అవకాశం రాక వెనుకబడినవారని, వారికి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ చారిత్రక ప్రకటన అనంతరం బీసీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Nara Chandrababu Naidu
BC Reservations Andhra Pradesh
AP Local Body Elections
34 Percent BC Reservation
Andhra Pradesh Assembly Sessions
Backward Classes Empowerment

More Telugu News